సిగరెట్లూ ఎగిరొస్తున్నాయి

2 Nov, 2015 00:11 IST|Sakshi
సిగరెట్లూ ఎగిరొస్తున్నాయి

ఇండోనేషియాలో తయారవుతున్న బ్రాండ్లు  
దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు రవాణా
గత ఏడాది కంటైనర్ల, ఈసారి ఎయిర్‌కార్గో
సిటీకి చెందిన ఘరానా ముఠా వ్యవహారం
ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారం
లోతుగా ఆరా తీస్తున్న డీఆర్‌ఐ అధికారులు

 
బంగారం... ఎలక్ట్రానిక్ వస్తువులు... మాదకద్రవ్యాలు... అక్రమ రవాణా పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. నగరానికి చెందిన ఓ ముఠా మాత్రం కొన్నాళ్లుగా సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తోంది. సిగరెట్లలో ఏముందిలే... అనుకుంటున్నారా? ఈ గ్యాంగ్ ఏటా రూ.వందల కోట్ల విలువైన వాటిని ‘దిగుమతి’ చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతోంది. డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు గత వారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ కార్గో కార్యాలయంలో వెలుగులోకి వచ్చిన కేసులో ఈ నిందితుల్ని అరెస్టు చేశారు. ఇదే గ్యాంగ్ గత ఏడాది మూసాపేటలోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలో బయటపడిన కేసులో డీఆర్‌ఐకే చిక్కింది. ఈ సిగరెట్ల అక్రమ రవాణా కారణంగా ఆర్థిక నష్టంతో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటని భావిస్తున్న డీఆర్‌ఐ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.     - సాక్షి, సిటీబ్యూరో
 
ఇండోనేషియా టు సిటీ వయా దుబాయ్...
సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే డజరమ్ బ్లాక్, గుడాన్  గరమ్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో నగరానికి వస్తున్నట్లు   డీఆర్‌ఐ గుర్తించింది. ఇవి తయారవుతున్నది ఇండోనేషియాలో అయినప్పటికీ అక్కడ నుంచి దుబాయ్ మీదుగానే సిటీకి వస్తున్నట్లు ఏడాదిన్నర కాలంలో వెలుగులోకి వచ్చిన ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.
 
ఒకటికి ఒకటిన్నర డ్యూటీ...
ఆరోగ్యానికి హానికరమని, స్థానిక వ్యాపారులకు నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవు ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది.  ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్‌ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్ వారి ద్వారా మార్కెట్‌లోని వెదజల్లుతోంది.
 
ఓసారి ఓడలు, మరోసారి విమానాలు...
సిటీకి సిగరెట్ల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్‌ఐ అధికారులు డేగకన్ను వేశారు. ఈ గ్యాంగ్ గత ఏడాది సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా తీసుకువచ్చింది. పిల్లలకు వినియోగించే డైపర్లని చెప్తూ కంటైనర్ ముందు వరుసల్లో వాటినే పెట్టి, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచ్చింది. మూసాపేటలో ఉన్న ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోకు ఇవి చేరుకోవడంతో ఉప్పందిన డీఆర్‌ఐ అధికారులు దాడి చేసి రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్లను పట్టుకున్నారు. ఈ ఏడాది పంథా మార్చిన అదే గ్యాంగ్ ఇంజనీరింగ్ వస్తువులు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌కార్గోలో ఉండగా గత నెల 13న దాడి చేసిన డీఆర్‌ఐ రూ.51 లక్షల వలువైన 85,000 సిగరెట్లు స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేసింది.
 
అన్ని పత్రాలు సృష్టించేస్తున్నారు...

విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులను ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో, ఎయిర్‌కార్గో కార్యాలయాల నుంచి తీసుకోవడానికి అనేక క్లియరెన్స్‌లు అవసరం. ఈ నేపథ్యంలో సిగరెట్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గ్యాంగ్ కస్టమ్స్ హోమ్ ఏజెంట్లు (సీహెచ్‌ఏ)లతో పాటు అనేక మందితో జట్టు కట్టింది. ఎగుమతి, దిగుమతి చేస్తున్నట్లు బోగస్ కంపెనీల పేర్లతో లెటర్ హెడ్స్ నుంచి కస్టమ్స్ క్లియరెన్స్ పత్రాల వరకు అన్నీ బోగస్‌వి సృష్టించేస్తున్నారు. వీటిని చూపిస్తూనే సరుకును బయటకు తీసుకువస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు అనుమానిస్తున్న డీఆర్‌ఐ ఆ కోణంలో దర్యాప్తు చేస్తోంది.
 
భారీగా మార్కెట్‌లోకి వెళ్లాకే...
సిగరెట్ల స్మగ్లింగ్‌లో ఒక్కోసారి ఒక్కో పంథాను అనుసరిస్తున్న ఈ ముఠా వ్యవహారాన్ని గుర్తించడానికి డీఆర్‌ఐ అధికారులకు కొంత సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారీ భారీగా సిగరెట్లు మార్కెట్‌లోకి వెళ్ళిపోయిన తరవాతే గుర్తించగలుగుతోంది. గత ఏడాది ఇన్‌లాండ్ కంటైనర్ డిపో కేంద్రంగా జరిగిన వ్యవహారాన్ని తీసుకుంటే ఒక్కో కంటైనర్‌లో 500 సీఎఫ్‌సీల చొప్పున సిగరెట్లు తీసుకువచ్చిందీ ముఠా. ఒక్కో సీఎఫ్‌సీలో పది వేల సిగరెట్లు ఉంటాయి. ఈ రకంగా మార్కెట్‌లోని 50 లక్షల సిగరెట్లు (14 కంటైనర్లు) వెళ్ళిపోయిన తరవాత డీఆర్‌ఐ గుర్తించి దాడులు చేసింది. డిపోలో ఉన్న రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్ల సిగరెట్లను పట్టుకోగలిగింది. ఎయిర్‌కార్గోలోనూ డీఆర్‌ఐకి రూ.51 లక్షల విలువైన సిగరెట్లు దొరకగా... అప్పటికి నెలన్నరలో రూ.90 లక్షల విలువైన కన్‌సైన్‌మెంట్లు మార్కెట్‌లోకి వచ్చేశాయని తేలింది. ఈ రెండు స్మగ్లింగ్స్‌కూ పాల్పడింది ఒకే ముఠాగా తేలింది.
 
ఆరోగ్యానికీ చేటనే అనుమానం...
విదేశీ సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని డీఆర్‌ఐ అనుమానిస్తోంది. ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసి అధికారులు ఆయా సిగరెట్లు కాలుస్తున్న పొగరాయుళ్ళతోనూ మాట్లాడారు. ఆయా సిగరెట్లు ఎక్కువసేపు కాలుతాయని, ఎంజాయ్‌మెంట్ ఎక్కువని చెప్పారు. ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా తెలియదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్ళిపోతున్నాయని వివరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు