అవినీతి లేదని చెప్పలేను కానీ..

28 Oct, 2013 03:18 IST|Sakshi

పంజగుట్ట, న్యూస్‌లైన్: ‘అన్ని వ్యవస్థల్లో మంచి, చెడులు ఉన్నట్లే, నిమ్స్‌లో కూడా మంచి,చెడులు ఉన్నాయని, ఇక్కడ అవినీతి లేదని చెప్పలేను కానీ, పూర్తిగా నిర్మూలించేందుకు శక్తి మేరకు ప్రయత్నిస్తున్నా. స్టోర్ మేనేజ్‌మెంట్, కొనుగోళ్లలో పారదర్శకత కోసం ఐదుగురు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేశాం. ఆపదలో వస్తున్న ప్రతీకేసును అడ్మిట్ చేసుకుంటున్నాం. ఒక్క రోగిని కూడా తిరిగి వెనక్కి పంపించడం లేదు’ అని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో పలు అంశాలపై ఆయన విపులంగా మాట్లాడారు. నిమ్స్‌కు 20-30 ఎమర్జెన్సీ కేసులు కేసులు వస్తుంటాయని, వీరిని 24 గంటల్లోనే సంబంధిత వార్డులకు తరలించి, వైద్యం చేస్తున్నామని, ఇలా పడకల సర్దుబాటు వల్ల ఆస్పత్రికి రోజుకు అదనంగా రూ.లక్ష చొప్పున ఏడాదికి రూ.3.60 కోట్లు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఆస్పత్రిలో కంప్యూటర్లు తరచూ మొరాయిస్తున్నాయని, సర్వర్ లోపాల వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని చెప్పారు.  
 
ఫిర్యాదులపై ప్రతిరోజూ సమీక్ష : రోగుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతివార్డులోనూ ఫిర్యాదు నోట్‌బుక్‌ను ఏర్పాటు చేయడంతోపాటు వచ్చిన ఫిర్యాదుల్లో ఐదు ప్రధానఅంశాలపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాం.


 గ్యాస్‌పైపులైన్ లేకపోవడం వల్లే : ఆస్పత్రి కొత్త భవనంలో ఉన్న ఆపరేషన్ థియేటర్‌లలో ఆక్సిజన్ గ్యాస్‌లైన్ సరిగ్గా లేదని, పూర్తి పరికరాలు అందుబాటులో లేవని, నర్సులు, టెక్నీషియన్‌ల కొరత ఉందని వీటన్నింటిని పరిష్కరించడానికి రూ.8కోట్ల నిధుల అవసరముంది. ప్రభుత్వం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ఆస్పత్రి ఆర్థికస్థితి తెలుసుకునేందుకే  రెండునెలల సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే దానిపై అవగాహన వస్తోంది.  
 
త్వరలో బీబీనగర్ నిమ్స్ సేవలు : బీబీనగర్ నిమ్స్ బయటకు కనిపించేందుకు అందంగా ఉన్నా..లోపల ఫ్లోరింగ్,విద్యుత్ సదుపాయం సరిగ్గా లేదు. ప్రభుత్వం రూ.62 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని..అవి మంజూ రు కాగానే అభివృద్ధి చేస్తాం. అతితక్కువ ఖ ర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ సెక్రటరీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు