సానియాను తీసుకువెళ్తుందనే...హత్య

5 Jul, 2016 10:39 IST|Sakshi

హైదరాబాద్ : భార్యను అతి కిరాతకంగా హతమార్చిన ఘటనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. (భార్యను ముక్కలు చేసి...కాల్చేసి...)   భార్య సింతియా విడాకులు కోరినందుకే రూపేశ్ కుమార్ అగర్వాల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. గతంలో దక్షిణాఫ్రికాలో పని చేసిన రూపేశ్ కుమార్కు కాంగో దేశస్తురాలు అయిన సింతియాతో పరిచయం అయింది. అనంతరం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం11ఏళ్లు పాటు సజావుగా కొనసాగింది. అయితే రూపేశ్, సింతియాల మధ్య కొన్నాళ్లుగా విబేధాలు తలెత్తాయి. ఫ్రాన్స్కు చెందిన ఓ వ్యక్తితో సింతియాకు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన రూపేశ్  పలుమార్లు భార్యతో గొడవ పడ్డాడు.

అయితే భర్తపై విడాకులకు ఒత్తిడి తెచ్చిన సింతియా, కుమార్తె సానియతో కలిసి ఫ్రాన్స్కు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనిపై రూపేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో భార్యా,భర్తల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగి, అది సింతియా హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాగా సింతియా వీసా మంజూరుకు ఫ్రాన్స్ వ్యక్తి సహకారం అందించటంతో పాటు, పెళ్లి చేసుకున్నట్లుగా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా పంపించినట్లు సమాచారం.  ఒక్కదానివే వెళ్లాలని, పాపను ఇచ్చేది లేదని అతడు తేల్చి చెప్పాడు.

అయితే కుమార్తెతో కలిసి సింతియా ఫ్రాన్స్ వెళ్లేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో రూపేశ్... గచ్చిబౌలిలోని తన నివాసంలో భార్య గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం సింతియా శవాన్ని 10 ముక్కలుగా చేసి ఓ పెద్ద బ్యాగ్లో ప్యాక్ చేశారు. శంషాబాద్ మండలం మదనపల్లె సమీపంలో చెట్ల పొదల్లో బ్యాగుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ క్రమంలో రూపేశ్ వాహనం బురదలో కూరుకుపోవటం, స్థానికులు అతడిని ప్రశ్నించడం, అందుకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో రూషేశ్ ఈ వివరాలు వెల్లడించినట్లు సమచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు