హైదరాబాద్: నగరంలోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో ఉదయం 9 గంటలకు గన్పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించేందుకు క్యాబ్ డ్రైవర్లు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని.. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామని, దానిని అడ్డుకోవడం సరికాదని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్కొందూల్కర్ తెలిపారు.