‘కారు’ చౌక ప్రయాణం!

5 Dec, 2014 00:24 IST|Sakshi
‘కారు’ చౌక ప్రయాణం!

ఆటో చార్జీలతోనే  క్యాబ్‌ల్లో  అందుబాటులో లగ్జరీ సేవలు
అంతర్జాతీయ సంస్థలు రాకతో మారిన పరిస్థితి  ప్రత్యేక యాప్‌లు,ఆన్‌లైన్ బుకింగ్‌లు

 
సిటీబ్యూరో: ఆటో చార్జీతో లగ్జరీ కారులో ప్రయాణం. అదీ మన మహా నగరంలో. మీరు చదివింది నిజమే. క్యాబ్‌లతో ఇది సాధ్యమవుతోంది. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే క్యాబ్ ప్రయాణం అందుబాటులో ఉండేది.. అంతర్జాతీయ సంస్థల ప్రవేశంతో పరిస్థితి మారింది. సంస్థల మధ్య పోటీ పెరిగింది. అత్యాధునిక సౌకర్యాలు, తక్కువ ఖర్చుతో లగ్జరీ కార్లలో సగటు సిటిజనులు ప్రయాణించే సౌలభ్యం కలిగింది. ఇంక ఆలస్యం ఎందుకు? ఎంచక్కా ఆటో చార్జీలతోనే కారులో రయ్..రయ్ మంటూ నగరాన్ని చుట్టేయండి.

నగరంలో  ప్రస్తుతం  గ్రీన్‌క్యాబ్స్, డాట్, ట్యాక్స్ ఫర్ ష్యూర్, ఓలా,ఊబర్, మేరు,ఫాస్ట్‌ట్రాక్, సీ క్యాబ్స్, స్కై క్యాబ్స్ తదితర సంస్థలు  క్యాబ్ సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఇండికా, ఇండిగో, సిడాన్, ఇన్నోవా, స్విఫ్ట్,స్విఫ్ట్ డిజైర్ వంటి వివిధ రకాలకు చెందిన 5000 కార్లు  ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రోజూ 25 వేల నుంచి 30 వేల మంది  ప్రయాణికులకు క్యాబ్స్ సేవలను వినియోగించుకొంటున్నారు. మేరు క్యాబ్స్ సుమారు 900 వాహనాలను కలిగి ఉండగా,  డాట్స్,ఓలా, గ్రీన్‌క్యాబ్స్ సంస్థలు వందలాది వాహనాలను అందుబాటులో ఉంచాయి. ‘డిమాండ్ బాగా ఉంది. అన్ని క్యాబ్ సంస్థలు కలిసి  ప్రస్తుతం  ఈ  డిమాండ్‌ను  60 శాతం మాత్రమే భర్తీ చేస్తున్నాయి. సమయాభావం, వాహనాల కొరతతో అందరికీ సేవలు అందించలేకపోతున్నాం’ అని నగరానికి చెందిన గ్రీన్‌క్యాబ్స్ సంస్థ  ప్రతినిధి అనిల్ కొఠారీ అభిప్రాయపడ్డారు. జపాన్‌కు చెందిన ‘జపనీస్ సాఫ్ట్ బ్యాంక్’, శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఊబర్ వంటి అంతర్జాతీయ సంస్థలు సేవలను విస్తరిస్తున్నాయి. క్యాబ్ సంస్థల మధ్య నెలకొన్న ఈ పోటీ వినియోగదారుడికి మేలు చేస్తోంది.
 
యాప్‌లు,ఆన్‌లైన్ బుకింగ్‌లు...


ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, చెన్నై, పూనె నగరాల్లో క్యాబ్స్‌ను ప్రవేశపెట్టిన ఊబర్ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్‌లో తన సేవలను ప్రారంభించింది. ఊబర్ వాహనాల కోసం ప్రయాణికులు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవలసి ఉంటుంది. చె ల్లింపులు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేక యాప్‌లు ఉన్నాయి. ఊబర్ వంటి పెద్ద సంస్థలే కాదు. కొద్ది పాటి వాహనాలతో ఈ రగంలో కొనసాగుతున్న చిన్న చిన్న క్యాబ్ సంస్థలు సైతం  వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రత్యేక యాప్‌లతో ముందుకు వస్తున్నాయి. 300 వాహనాలతో  ప్రయాణికులకు సేవలను అందజేస్తున్న గ్రీన్‌క్యాబ్స్ జీపీఆర్‌ఎస్, వెహికిల్ ట్రాకింగ్, యాప్,ఆన్‌లైన్ బుకింగ్ సేవలను కొనసాగిస్తోంది.

లగ్జరీ వాహనాలు...

ఇప్పటి వరకు ఇండికా, సీడాన్, ఇన్నోవా వంటి వాహనాలతో పాటు,  మారుతీ స్విఫ్ట్ డిజైర్ వంటివి  ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో వాహనాల స్థాయిని బట్టి  చార్జీల్లో  మార్పులు  తప్పనిరి. ఇండికా వంటి వాహనాల్లో కిలోమీటర్‌కు రూ.10 చొప్పున చార్జీ తీసుకుంటే, ఇన్నోవాల్లో రూ.15 చొప్పున తీసుకుంటున్నారు. స్విఫ్ట్‌డిజైర్‌లో ఇంకొంచెం ఎక్కువే. ఊబర్‌క్యాబ్స్   బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌బెంజ్, ఆడి వంటి లగ్జరీ వాహనాలను  వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
 
1.6 కిలోమీటర్‌ల కనీస దూరానికి ఆటో చార్జీ రూ.20. ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున చార్జీ ఉంటుంది. ఈ లెక్కన  సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరానికి ఆటోచార్జి రూ.108. కానీ ఇప్పుడు కిలోమీఆటర్‌కు రూ.10 చొప్పున చెల్లించి కేవలం రూ.100తో సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్ వరకు క్యాబ్ జర్నీ చేయవచ్చు. నగరంలో ఎక్కడి నుంచైనా  సరే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు గతంలో రూ.490  వరకు చార్జీ విధించిన ఓలా క్యాబ్స్ ఇప్పుడు  రూ.390కే  ఆ సదుపాయాన్ని  అందజేస్తోంది. ఓలా క్యాబ్స్‌తో  మిగతా  సంస్థలు సైతం పోటీ పడుతున్నాయి. ఇటీవల నగరంలో తన సేవలను ప్రారంభించిన  ఊబర్ క్యాబ్స్  ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అత్యాధునిక సదుపాయాలతో ఆకట్టుకుంటోంది.
 
 

>
మరిన్ని వార్తలు