మంత్రి తలసాని కుమారునిపై కేసు

31 Mar, 2016 09:59 IST|Sakshi

హైదరాబాద్: బెదిరింపుల వ్యవహారంలో మంత్రి తలసాని యాదవ్ కుమారుడు సాయి యాదవ్‌పై కేసు నమోదైంది. భూ వివాదంలో జోక్యం చేసుకుని, తనను బెదిరించాడంటూ ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు గురువారం ఉదయం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాయదుర్గంలోని తన ఐదెకరాల భూమి డెవలప్‌మెంట్ కోసం రామకృష్ణ అనే వ్యక్తికి చెందిన రామకృష్ణ కన్‌స్ట్రక్షన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నానని, అయితే అతడు సరిగా డబ్బులు చెల్లించకపోవటంతో డీల్ రద్దు చేసుకున్నట్లు రామకోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ విషయమై మాట్లాడాలని తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొడుకు సాయియాదవ్, రామకృష్ణ కలసి తాజ్‌కృష్ణ హోటల్‌కు రావాలని బుధవారం సాయంత్రం కబురు పంపారని, అక్కడికి వెళ్లగా తనను మంత్రి కుమారుడు బెదిరించాడని ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ జరిపి మంత్రి కొడుకు సాయి యాదవ్‌పై కేసు నమోదు చేశారు.

అయితే, ఇదే వ్యవహారంలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన భర్తను మంత్రి కుమారుడు కిడ్నాప్ చేశారంటూ బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు