సీసీఎంబీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు

7 Aug, 2017 01:17 IST|Sakshi
సీసీఎంబీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు
పీఎం.భార్గవ సంతాప సభలో జైపాల్‌ రెడ్డి
 
హైదరాబాద్‌ : సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ)ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి పీఎం భార్గవ అని కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌ రెడ్డి అన్నారు. భార్గవ లాంటి వ్యక్తులను దేశం పుట్టించకపోతే భవిష్యత్‌ అంధకారంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌ పీఎం భార్గవ సంతాప సభలో పలువురు ఘనంగా నివాళులర్పించా రు. జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. భార్గవ ఒక వ్యక్తి కాదు సంస్థగా ఎదిగారని..సైన్స్‌కు సమాజానికి మధ్య సంబంధాన్ని పెంచాలనే తపన భార్గవలో కనిపించేదన్నారు.

నెహ్రూ తరం ఆఖరి ప్రతినిధిగా భార్గవను పేర్కొనవచ్చు అన్నారు.  శాస్త్రవేత్తలు మౌనం వహించటం సమాజానికి తీవ్రవాదం కంటే ప్రమాదకరమని  మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు.  సైన్స్‌ ప్రభావంతోనే రాజకీయాల్లోకి వచ్చానని అందుకే శాస్త్రవేత్తలంటే నాకు ఎంతో గౌరవం  అని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు  అన్నారు.  ప్రొఫెసర్‌ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణసీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ, మాజీ డైరెక్టర్లు లాల్జీసింగ్, డాక్టర్‌ సీహెచ్‌.మోహన్‌ రావు, డాక్టర్‌ మెహతాబ్, ఎస్‌.బామ్జీ, ఐఐసీటీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ అహ్మద్‌ కమాల్, డాక్టర్‌ హర్ష గుప్త, ప్రొఫెసర్‌ బీఎన్‌.రెడ్డి, సత్యప్రసాద్, టి.రమేశ్, శ్రీనా«థ్, ఎ.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు