సెల్‌ఫోన్లు కొట్టేయడమే కాకుండా...

15 Oct, 2015 08:22 IST|Sakshi
నిందితుడిని చూపిస్తున్న పోలీసులు

హైదరాబాద్: ఇళ్లల్లో సెల్‌ఫోన్లు చోరీ చేసి.. అందులో మహిళల నెంబర్లకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్న ఓ కేటుగాడిని బాలానగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. బుధవారం బాలానగర్ సీఐ భిక్షపతిరావు, ఎస్‌ఐ ఎస్.వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం...

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అర్లపాడి గ్రామానికి చెందిన ముతుకుందు బ్రహ్మయ్య (27) బాలానగర్ ఫిరోజ్‌గూడలో ఉంటూ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గొడవ జరగడంతో ఇతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా,నగరంలో ఒంటరిగా ఉంటున్న బ్రహ్మయ్య బాలానగర్  పరిసరాల్లోని ఇళ్లల్లో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నాడు. ఆ ఫోన్లలోని మహిళల నెంబర్లకు ఫోన్ చేసి, అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. 

సెప్టెంబర్ 9న ఓ బాధితురాలు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మరికొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతికష్టం మీద నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు