ఓయూ మట్టిలోనే మహత్మ్యం ఉంది

28 Apr, 2017 03:25 IST|Sakshi
ఓయూ మట్టిలోనే మహత్మ్యం ఉంది

ఎంతోమంది మహానుభావులను కన్నతల్లి
- నా జీవితానికి దారి చూపింది ఓయూనే..
- మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు
- ఉల్లాసంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం


సాక్షి, హైదరాబాద్‌: ఎంతో మంది మహానుభా వులను, పోరాటయోధులను, ప్రముఖులను, మేధావులను కన్నతల్లి ఉస్మానియా విశ్వవిద్యాలయం అని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. ఉస్మానియా మట్టిలోనే ఎంతో మహత్మ్యం ఉందని పేర్కొ న్నారు. జీవితంలో ఎంతో సంఘర్షణకు గురైంది కూడా వర్సిటీలోనే. ఈ సంఘర్షణలో నా జీవితానికి దిశానిర్దేశాన్ని అందజేసిన గొప్ప తల్లి ఉస్మానియానే’ అని చెప్పారు. విభిన్న భావజాలాలు, సిద్ధాంతాల మధ్య ఒక స్పష్ట మైన కార్యాచరణను ఎన్నుకునేందుకు అవ కాశం కలిగించింది ఓయూనే అని పేర్కొ న్నారు. ఉస్మానియా వర్సిటీ శతాబ్ది వారోత్స వాల్లో భాగంగా గురువారం ఓయూ అలుమ్ని అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన పూర్వ విద్యా ర్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌.జైపాల్‌రెడ్డి, తమిళనాడు మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ టి.మీనాకుమారి, ఉస్మానియా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రం, అలుమ్ని అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.శ్యామ్‌మోహన్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. నూరేళ్ల ఉస్మానియా విశ్వ విద్యాలయం ఎన్నో ఘనకీర్తులను సాధించిం దని అన్నారు. స్వాతంత్య్రోద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఉస్మానియా త్యాగాల బాటలో నడిచిందని, ఎన్నో గొప్ప పోరాటాలు చేసిందని గుర్తు చేసుకున్నారు.

విశ్వవిద్యాలయంలో చిందిన అమరుల రక్తం సుగంధమై, సువర్ణమై, విజయ బావుటాగా ప్రపంచమంతటా ఎగిసిందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తానూ పోలీసు దెబ్బలు తిన్నానని చెప్పారు. ఓయూ విద్యార్థులకు ప్రపంచ దేశాలు తలుపులు తెరిచి సాదరంగా స్వాగతం పలి కాయని, ఉస్మానియా నుంచి అందుకున్న డిగ్రీ పట్టానే పాస్‌పోర్టు, వీసాల కన్నా విలువైనదిగా భావించాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఓయూను సమున్నతంగా నిలిపేందుకు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన 200 వర్సిటీల్లో ఓయూ స్థానాన్ని పొందేందుకు పూర్వ విద్యార్థుల సమాఖ్య కృషి చేయాలని, అందుకు తన వంతు సహకారం అందజేస్తానని విద్యాసాగర్‌రావు ప్రకటించారు.

జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి: జైపాల్‌రెడ్డి
జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా వర్సి టీ విద్యార్థిగా, విద్యార్థి సంఘం నాయకుడిగా తన రాజకీయ జీవితానికి ఇక్కడే పునాదులు పడ్డాయని చెప్పారు. విద్యార్థులు సామాజిక స్పృహను, చైతన్యాన్ని కలిగి ఉండాలని, నిరంతరం జ్ఞాన తృష్ణతో ముందుకు సాగాలని సూచించారు. డిగ్రీలు, పీహెచ్‌డీ పట్టాలు ఎంత ముఖ్యమో.. తెలుసుకోవాలనే తపన కూడా అంతే ముఖ్యమన్నారు. ఎంతో గొప్పగా జరుగుతున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థుల కంటే పోలీసులే ఎక్కువ సంఖ్యలో ఉండడం అపశకునంగా కనిపిస్తోందని విచా రం వ్యక్తం చేశారు. జస్టిస్‌ మీనాకుమారి మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన గొప్ప వ్యక్తులు ఈ వర్సిటీలో చదువుకున్నారని, ఎంతోమంది మహిళలు సైతం ఇక్కడ చదువుకుని ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని చెప్పారు. అలుమ్ని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణలోని 100 మారుమూల గ్రామాలను దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి చేయను న్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్యామ్‌ మోహన్‌ తెలిపారు.

వర్సిటీ అభివృద్ధికి రూ.200 కోట్లు: దత్తాత్రేయ
కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఉస్మానియా అభివృద్ధికి కేంద్రం ఇప్పటి వరకు రూ.200 కోట్ల వరకు అందజేసిందన్నారు. త్వరలోనే వర్సిటీలో ఒక ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజ్‌ను, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎంపీ నిధుల కింద వర్సిటీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు