'చంద్రబాబుకు ఆ పిచ్చి పీక్ స్టేజ్కి చేరింది'

14 Oct, 2015 16:04 IST|Sakshi
'చంద్రబాబుకు ఆ పిచ్చి పీక్ స్టేజ్కి చేరింది'

హైదరాబాద్ :  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ సీపీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని, ఆ పిచ్చి కాస్తా పీక్ స్టేజ్కి చేరిందని ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కార్యాలయంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవన్న చంద్రబాబు, తన ప్రచారానికి మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.  రాజధాని శంకుస్థాపన పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

గోదావరి పుష్కరాలలో రూ.1650 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే అందులో రూ.1400 కోట్లు దుర్వినియోగం అయ్యాయని బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ను ఆహ్వానిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పథకాల పేరుతో వందల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న అథితులకు వాళ్ల సొంత హోటల్స్లో విడిది ఏర్పాటు చేసి ప్రజలు, ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెడుతున్నారని బత్తుల ఆరోపించారు.

మరిన్ని వార్తలు