స్కూల్‌లో చిన్నారుల ఫైట్.. ఒకరి మృతి

17 Jul, 2016 10:11 IST|Sakshi
స్కూల్‌లో చిన్నారుల ఫైట్.. ఒకరి మృతి

- టోలిచౌకీలో ఘటన
హైదరాబాద్: హేళనలతో బడిలో చిన్నారుల మధ్య రగిలిన వివాదం దాడులకు కారణమైంది. చివరకు ఒకరి ప్రాణాలను బలిగొంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలివి... ఈ నెల 12న టోలిచౌకి ఐఏఎస్ కాలనీలోని ప్రామిసింగ్ స్కాలర్స్ హైస్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్న మహ్మద్ ఇబ్రహీం(6)... మూడో తరగతి విద్యార్థిని చీమిడి ముక్కోడా అంటూ గేలి చేశాడు. దీంతో కోపం పట్టలేని ఆ విద్యార్థి... నన్ను టీజింగ్ చేస్తావా అంటూ తరగతి గదిలోనే ఇబ్రహీం మర్మాంగాలపై తన్నాడు. కుప్పకూలిన ఇబ్రహీం... కాసేపటి తరువాత లేచి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే తనకు మర్మాంగాల వద్ద నొప్పిగా ఉందని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు.
 
 వారు తొలుత పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజు ఉదయం చూడగా చిన్నారికి దెబ్బ తగిలినచోట బాగా వాపు వచ్చింది. కంగారెత్తిన తల్లిదండ్రులు ఇబ్రహీంను వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పురుషాంగం, కడుపు ప్రాంతాల్లో శస్త్రచికిత్సలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజాము 3 గంటలకు చిన్నారి మరణించినట్టు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్‌గా పనిచేసే ఇబ్రహీం తండ్రి ముజీబ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నించి, వివరాలు తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు