బాదంపాలు అనుకుని విషం తాగారు

10 Mar, 2017 13:02 IST|Sakshi
రంగారెడ్డి: జిల్లాలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వినాయక నగర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. పాలలో పురుగుల మందు కలుపుకొని తాగి స్పృహ కోల్పోయింది. ఇది గమనించని ఆమె ఇద్దరు పిల్లలు బాదంపాలు అనుకొని విషం కలిపిన పాలను తాగారు. దీంతో ఓ చిన్నారి మృతి చెందగా.. తల్లితో పాటు కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
కాలనీకి చెందిన విజయలక్ష్మి(38) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కడుపునొప్పి భరించలేక పురుగుల మందు కలిపిన పాలను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించని ఆమె పిల్లలు యశస్విని(6), యశ్వంత్‌(4) పురుగుల మందు కలిపిన పాలు తాగి అస్వస్థతకు గురయ్యారు. ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ యశస్విని మృతి చెందింది. యశ్వంత్‌తో పాటు తల్లి విజయలక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని వార్తలు