ఈటలను టీఆర్ఎస్ అధ్యక్షుడిని చెయ్యగలరా ?

12 Jun, 2016 13:23 IST|Sakshi
ఈటలను టీఆర్ఎస్ అధ్యక్షుడిని చెయ్యగలరా ?

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు చింతల రామచంద్రారెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న బహిరంగసభను చూసి టీఆర్ఎస్ ఓర్వలేక పోతుందని చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. అమిత్ షా వ్యాఖ్యలకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర ఉలిక్కిపడి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రూ. 90 కోట్లు కాదు.... రూ. 1.16 లక్షల కోట్లు కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ లేదా ఫామ్హౌస్లో అయిన బహిరంగ చర్చకు సిద్ధమని చింతల రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కరువు నివారణకు రూ. 791 కోట్లు మోదీ ప్రభుత్వం మంజూరు చేస్తే... ఆ సొమ్ము ఒక్క రైతుకైనా ఇచ్చారా ? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ అధ్యక్షుడిని చెయ్యగలరా? అని కేసీఆర్కు సవాల్ విసిరారు. ఫాంహౌస్, సచివాలయంలో సీఎం కేసీఆర్ ఎన్ని రోజులు ఉన్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

మోదీ కేంద్రంలో అధికారంలో చేపట్టి రెండేళ్లు పూర్తి అయన సందర్భంగా వికాస్ పర్వ్ పేరిట దేశవ్యాప్తంగా బీజేపీ విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది. అందులోభాగంగా ఇటీవల ఆ పార్ట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ప్రతిస్పందించారు. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై చింతల రామచంద్రారెడ్డిపై విధంగా స్పందించారు.

మరిన్ని వార్తలు