ఛోటా సమోసా.. స్వాద్ హమేషా

24 Nov, 2014 00:12 IST|Sakshi
ఛోటా సమోసా.. స్వాద్ హమేషా

పిరమిడ్‌కు మినియేచర్‌లా కనిపించే ఆకారం. దూరం నుంచే నాసికను అలరించే ఘుమఘుమ. నోట్లో వేసుకుంటే, నాలుకపై రుచిమొగ్గలను మేల్కొలిపే మహత్తరమైన రుచి. ఇదంతా ‘కింగ్ ఆఫ్ స్నాక్స్’గా ముద్దుగా పిలుచుకునే సమోసా ఘనత. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ చిరుతిండి దేశ దేశాలు దాటి మన దేశంలోకి అడుగుపెట్టింది. రకరకాలుగా రూపాంతరం చెందింది. మన హైదరాబాద్‌లో కాస్త సూక్ష్మరూపాన్ని సంతరించుకున్న ఛోటా సమోసా రుచికి చిరునామాగా మారింది. ఛోటా సమోసా ఇప్పుడు భాగ్యనగరం నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, సింగపూర్ సహా పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. కచ్చితమైన లెక్కలేవీ లేవు గానీ, ఛోటా సమోసాల వ్యాపారం విలువ వందల కోట్లలోనే ఉంటుందని అంచనా.

‘అరే ఛోటూ! ఏక్ చాయ్.. ఛోటే సమోసే కే సాథ్’ అనే కేకలు సిటీలోని ఇరానీ కేఫ్‌లలో వినిపించడం సర్వసాధారణం. చాయ్ తాగుతూ, ఛోటా సమోసాల కరకరలతో కబుర్లు నంజుకోవడం  ‘సిటీ’జనుల చిరకాలపు అలవాటు. సమోసా కరకరలే లేకుంటే, పిచ్చాపాటీ మాటల్లో మస్తీనే ఉండదనే వారు చాలామందే ఉంటారు. అందుకేనేమో ఈ చిన్న సమోసా అంత పెద్ద ప్రతిష్టను మూటగట్టుకుంది.
 
వెయ్యేళ్ల నాటి రుచి...


ఢిల్లీ సుల్తాన్‌లు దేశంలోకి అడుగుపెట్టినప్పుడు వెంట వారి ఆచారవ్యవహారాలనే కాదు ‘రుచు’లనూ మోసుకొచ్చారు. అలా ఎడారి దేశం నుంచి పదో శతాబ్దంలో మనదేశంలోకి అడుగుపెట్టింది ‘సంబుసాక్’.ఇదే సమోసాగా రూపాంతరం చెందింది. దేశమంతా ఒక రకమైన సమోసా ఉంటే, భాగ్యనగరంలో మాత్రం ఇది మరింత విలక్షణంగా ఉంటుంది. సాధారణ సమోసా కంటే కాస్త చిన్నగా ఉండే ఈ ఛోటా సమోసా.. హైదరాబాదీ సమోసాగా గుర్తింపు పొందింది.

కుటీర పరిశ్రమ..

సమోసాల తయారీ నగరంలో ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. కొన్ని వేల కుటుంబాలు దీనిపైనే జీవనోపాధి పొందుతున్నాయి. ఇటీవలి కాలంలో సమోసా తయారీ యంత్రాలు కూడా వచ్చేశాయి. నగరం నుంచి నిత్యం లక్షల సంఖ్యలో చిన్న సమోసాలు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. చాలా ఆసియా దేశాలకు సమోసాలు కొత్త కాకున్నా, క్రిస్పీగా ఉండే హైదరాబాదీ ఛోటా సమోసాలకు అక్కడ గిరాకీ ఎక్కువ. అందుకే ఇది ఎగుమతి సరుకు స్థాయికి ఎదిగింది.
 
తొలుత మాంసంతోనే...

మధ్య ఆసియాలో పిండితో చేసిన పొట్లంలో మాంసాన్ని కూరి వేయించడంతో సమోసాకు అంకురార్పణ జరిగింది. మన దేశానికి వచ్చిన తొలినాళ్లలోనూ ఇది నాన్‌వెజ్ వెరైటీనే. మాంసంతో పాటు బాదం పిస్తా, ఇలాచీ కూరి నేతిలో వేయించేవారు. క్రమంగా ఉల్లిపాయలు, ఆలుగడ్డలతో తయారు చేయడం మొదలైంది. కుతుబ్‌షాహీల జమానాలో ఇది కొత్త రూపు  సంతరించుకుంది. తయారీ విధానం తేలికగానే కనిపించినా, పిండితో పొట్లం చేసే విధానంలోనే మెలకువ ఉంటుంది. అందులో తేడా వస్తే కరకర తీరు మారిపోతుంది. అందుకే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో దొరికే సమోసాలకు, హైదరాబాదీ సమోసాలకు చాలా తేడా ఉంటుందంటారు భోజనప్రియులు.

మరిన్ని వార్తలు