గ్రూప్‌–1, 2కు కామన్‌ సిలబస్‌

19 Feb, 2017 01:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసులైన గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగ నియామకాలకు దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి అమలు కానుంది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్ల జాతీయ సదస్సులో సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి ప్రతిపాదించగా.. యూపీఎస్సీ చైర్మన్‌ డేవిడ్‌ రీడ్‌ సిమ్లెతోపాటు వివిధ రాష్ట్రాల పీఎస్సీ చైర్మన్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీసు కమిషన్ల పనితీరు అధ్యయన సబ్‌కమిటీ చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి.. టీఎస్‌పీఎస్సీని నమూనాగా తీసుకుని ఈ మేరకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ప్రతిపాదిత అంశాలివే..
► దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్‌ పోస్టుల భర్తీ మాదిరిగా గ్రూప్‌–1, గ్రూప్‌–2 భర్తీలో ఒకే విధానం, ఒకే సిలబస్‌ను అనుసరించాలి.
► సిలబస్‌లో 70 శాతం ఒకేరకంగా ఉన్నప్పటికీ.. మిగతా 30 శాతం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఉంటే సరిపోతుంది.
► అన్ని రాష్ట్రాలు యూపీఎస్సీ మోడల్‌నే అనుసరించాలి
► ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ చాలా వరకు యూపీఎస్సీ విధానాన్నే అమలు చేస్తోంది.
► పీఎస్సీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలన్నీ డిజిటలైజేషన్‌ చేయాలి.
► దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపులు తదితర కార్యక్రమాలు ఆన్‌లైన్‌ పద్ధతిలోనే జరగాలి.

మరిన్ని వార్తలు