‘మొదటి’కే మోసం...

20 Apr, 2015 02:57 IST|Sakshi

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లో గందరగోళం
పేర్ల నమోదులో లోపించిన శాస్త్రీయత
ఏ రెండు పేర్లు కలిసినా తప్పని ఇబ్బందులు
ముప్పుతిప్పలు పెడుతున్న ఆర్టీఏ అధికారులు
‘సాంకేతిక వైఫల్యం’ సాకు..

 
 
సాక్షి,సిటీబ్యూరో : రాంనగర్‌కు చెందిన  కల్లూరి వసంత... తాను కొత్తగా కొనుగోలు చేసిన మారుతి స్విఫ్ట్ డిజైర్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు.  అప్పటికే  ఆమె పేరిట  ఒక ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉందని, తాజాగా రెండో వాహనం (కారు) రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెండు  శాతం  జీవితకాల పన్ను అదనంగా చెల్లించాలని అధికారులు  సెలవిచ్చారు. దాంతో ఆమె  విస్మయానికి గురయ్యారు. ఇప్పటి వరకు ఎలాంటి వాహనాలు కొనుగోలు చేయలేదని, ఇదే మొట్టమొదటి  వాహనమని చెప్పారు. కానీ ఆర్టీఏ అధికారులు అంగీకరించలేదు.

గతంలో తనకు ఎలాంటి వాహనాలు లేవని  స్వతహాగా నిరూపించుకొంటే తప్ప  అదనపు పన్ను రద్దు చేయబోమన్నారు. ఇంకేముంది. 2 నెలల పాటు నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో వడపోసి బహదూర్‌పురాకు చెందిన తన లాంటి పేరే ఉన్న మరో మహిళ కు హోండా యాక్టివా ఉన్నట్లు నిరూపించారు. అలా ఆమె ఎంతో సంతోషంగా కొనుక్కొన్న కారు రిజిస్ట్రేషన్ కావడానికి ఏకంగా 2 నెలలు పట్టింది. ఇది ఒక్క  వసంత సమస్య కాదు. నగరంలోని వేలాది మంది ఎదుర్కొంటున్న సమస్య.కంఫ్యూటర్‌లో వాహనదారుల వివరాలను నమోదు చేయడంలోని అశాస్త్రీయత, అసమగ్రత, సాంకేతిక లోపాల కారణంగా ఒకే తరహా  ఇంటిపేర్లు, వ్యక్తుల పేర్లు  ఉన్న వాహనదారుల పాలిట ‘ సెకెండ్ వెహికిల్’ ఒక వేధింపుగా మారింది.

ఎందుకిలా...
మోటారు వాహన చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకటి  కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉంటే రెండో వాహనం ఖరీదులో  ద్విచక్రవాహనం అయితే 5 శాతం, కారు అయితే 2 శాతం చొప్పున జీవితకాలపన్ను చెల్లించాలి. కానీ కొంతమందికి మొదటి వెహికిల్ లేకపోయినప్పటికీ కొత్తగా కొనుగోలు చేసిన దాన్ని సెకెండ్ వెిహ కిల్‌గా పరిగణించి పన్ను చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు ఆర్టీఏ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలను ఆధారంగా చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు  సుమారు  1500 వాహనాలు రిజిస్ట్రేషన్ అయితే, వాటిలో 25 శాతం వాహనాలపై  వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

2009 నుంచి  2013 వరకు దశలవారీగా ప్రవేశపెట్టిన త్రీటైర్  సాంకేతిక పరిజ్ఞానం కారణంగా తలెత్తిన దుష్ఫలితం ఇది. టూటైర్ సాంకేతిక పరిజ్ఞానం నుంచి టూటైర్‌లోకి  మారుతున్న దశలో వాహనాల వివరాలను  శాస్త్రీయంగా న మోదు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఒకే పేరు ఉన్న ఇద్దరు వ్యక్తులు వాహనాల రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది.

ఆనంద్‌నగర్‌కు చెందిన ఒక వాహనదారుడు కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ కోసం  ఖైరతాబాద్‌కు  వెళ్లాడు. అప్పటికే  ఒక వాహనం అతని పేరిట ఉన్నట్లు అధికారులు యదావిధిగా చెప్పారు. నల్గొండలోని రామన్నపేటకు చెందిన తన ఇంటిపేరే కలిగిన  మరో వ్యక్తి వివరాలను సేకరించి తెస్తే తప్ప అధికారులు అతని వాహనం రిజిస్ట్రేషన్ చేయలేదు. ఏజెంట్‌లు, దళారులను ఆశ్రయించి వచ్చే వారికి మాత్రం మినహాయింపు లభించడం కొసమెరుపు...

మరిన్ని వార్తలు