పార్టీని వీడిన నేతల గురించి ఆందోళన వద్దు: వీహెచ్

14 Jun, 2016 15:35 IST|Sakshi

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. పదవీ త్యాగాలకు సిద్ధపడొద్దని జానారెడ్డికి ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నేతల గురించి ఆవేదన చెందొద్దని చెప్పారు. సీఎల్పీ నేతగా జానారెడ్డి తప్పుకుంటే కాంగ్రెస్ కేడర్ స్థైర్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆపదలో ఉన్నందున జానారెడ్డి లీడర్ గా ముందు నిలిచి పార్టీని నిలబెట్టాలని సూచించారు.

రెండేళ్ల పాలనలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలన్నారు. సీఎం కేసీఆర్ వైఫల్యాలను గ్రామగ్రామాన ఎండగట్టేందుకు కాంగ్రెస్ కేడర్ సిద్ధపడాలని వీహెచ్ పిలుపునిచ్చారు. పార్టీ ప్రతిష్ట కోసం సీఎల్పీ పదవి వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జానారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వీహెచ్ మీడియా సమావేశంలో పాల్గొని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

>
మరిన్ని వార్తలు