కాంగ్రెస్, వామపక్షాలకు కనువిప్పు కావాలి

20 May, 2016 01:45 IST|Sakshi
కాంగ్రెస్, వామపక్షాలకు కనువిప్పు కావాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీపై మతతత్వ ముద్రతో విషం చిమ్మిన కాంగ్రెస్, వామపక్షాలకు అస్సాం ఎన్నికల ఫలితాలతో కనువిప్పు కలగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అస్సాంలో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం సంబరాలను జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. మిఠాయిలు పంచుకుని, నృత్యాలు చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 40 శాతం మైనారిటీ ఓటర్లున్న అస్సాంలో బీజేపీ ఘనవిజయం సాధించడం ప్రజలు తమ పార్టీవైపే ఉన్నారన్న విషయాన్ని స్పష్టంచేస్తోందన్నారు. టీఆర్‌ఎస్ ఒంటెత్తు పోకడలను, నియంతృత్వ విధానాలను నిలువరించేవిధంగా బీజేపీ పోరాడుతుందన్నారు. సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత విమర్శలకు, బెదిరింపులకు దిగడం సరైందికాదన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, నేతలు ప్రేమేందర్‌రెడ్డి విజయలక్ష్మి, సత్యనారాయణ, ఎస్.మల్లారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు