కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

23 Feb, 2016 01:11 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీలకు మార్చి 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది.  ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. ఆఖరి తేది ఫిబ్రవరి 24 వరకు కొనసాగనుంది. ఈ నెల 25న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు విధించారు.

మున్సిపల్ ఎన్నికల చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసి గతంలో 21 (మూడు వారాలు) రోజుల పాటు ఉండే ఎన్నికల ప్రక్రియను 14 రోజులకు (రెండు వారాలు) కుదించింది. ఎన్నికల నిర్వహణ మధ్యలో సెలవులు వచ్చినా పని దినాలుగానే ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ‘నోటా’ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు.  కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మార్చి 6న పోలింగ్ నిర్వహించి, మార్చి 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు