అవినీతిని మంత్రి తేలుస్తారా? తేల్చేస్తారా?

6 Dec, 2015 12:47 IST|Sakshi
అవినీతిని మంత్రి తేలుస్తారా? తేల్చేస్తారా?

మార్కెటింగ్ శాఖలో వసూల్ రాజాగా పేరొందిన ఓ ముఖ్య ఇంజనీరు అవినీతి సంగతి సీఎం వద్ద తేల్చాల్సిందేనని ఉత్తరాంధ్రకు చెందిన ఓ అమాత్యుడు పట్టుబడుతున్నారట. ఆ  ఇంజనీరుకు మంత్రి ఫోన్ చేసి మరీ ‘నీ అవినీతి చిట్టా విప్పుతానంటూ’ హెచ్చరించడంతో ఇంజనీరు మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు కింది ఉద్యోగులకు అప్పటికే నెలవారీ విధిస్తున్న ఇండెంట్లు రెట్టింపు చేశారట. మార్కెటింగ్ శాఖలో పనులే లేవు.. పర్సంటేజీలకు అవకాశం లేదని ఇంజనీర్లంతా వాపోతుంటే.. జీతాల నుంచైనా మామూళ్లు ఇవ్వాల్సిందేనని, అందరినీ మేనేజ్ చేయాలంటే కష్టమైపోతుందని ముఖ్య ఇంజనీరు బాహాటంగానే ఎవరెవరికి సమర్పించుకోవాలో.. ఇండెంట్ల చిట్టా విప్పుతున్నారట.

తమ గోడు చెప్పుకుందామంటే.. ముఖ్య ఇంజనీరు తన గోడు చెబుతున్నారని, మంత్రుల మొదలు.. సచివాలయం అధికారుల వరకు తన పదవిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందనీ, ఇప్పుడు కొత్తగా ఓ మంత్రి తగులుకున్నారని, ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు వసూళ్లు తప్పట్లేదని... ఇంజనీర్లకు  చెప్పుకుంటున్నారట. దీంతో వారు మూకుమ్మడిగా ఉన్నత స్థాయికి ఫిర్యాదులు చేసే పనిలో పడ్డారట. ముఖ్య ఇంజనీరు అవినీతిని మంత్రి నిజంగా తేలుస్తారా? తేల్చేస్తారా? అన్న అనుమానాలు అంతా వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు