చిన్నారిని చిదిమేశారా..?

21 Sep, 2016 03:21 IST|Sakshi
మానస (ఫైల్) : లక్ష్మీ, మునీర్ దంపతులు

* నాలుగేళ్ల బాలికను దంపతులు చావగొట్టారు: స్థానికులు  
* కాదు... మెట్లపై నుంచి కింద పడి మరణించింది: దంపతులు
* ముషీరాబాద్‌లో ఘటన

హైదరాబాద్: నాలుగేళ్ల పసికందును విచక్షణారహితంగా కొట్టారు. కనికరం లేకుండా మోకాళ్లపై కూర్చోబెట్టి చీపురుతో బాదారు. చిత్రహింసలు భరించలేక చిన్నారి గుండెలవిసేలా ఏడుస్తుంటే... నోరెత్తితే కాలుస్తామంటూ అగ్గిపుల్ల గీసి భయపెట్టారు భార్యాభర్తలు. చివరకు వారి దాష్టీకానికి చిన్నారి బలైన ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మునీర్, లక్ష్మికి ఏడాది క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరు. ఈ నెల ఒకటిన మోహన్ నగర్‌లో ఓ ఇంటి మొదటి అంతస్తులో కిరాయికి దిగారు.

వీరికి పల్లవి, వెంకట్ అనే భార్యా భర్తలు స్నేహితులు. వీరికి మానస(4) అనే కుమార్తెతో పాటు బాబు కూడా ఉన్నాడు. ఈ రెండు జంటలు ముషీరాబాద్‌లోని ఆయేషా ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తున్నారు. ఈ పరిచయంతో గతంలో అనేక సార్లు మానసను మునీర్, లక్ష్మి తమ ఇంటికి తెచ్చుకుని కొన్నాళ్లు ఉంచుకుని పంపారు. అలాగే 15 రోజుల క్రితం పాపను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుకున్నారు. మానసకు ఇంట్లోనే మూత్రం, మల విసర్జన చేసే అలవాటు ఉంది. ఈ నెల 16న ఇంట్లోనే మల విసర్జన చేయడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురై వీపరీతంగా కొట్టారు.

ఇదేమిటని స్థానిక మహిళలు ప్రశ్నించగా... తల్లి వద్దకు తీసుకెళుతున్నామని చిన్నారిని వెంటబెట్టుకెళ్లారు. 4 రోజుల తరువాత మంగళవారం ఇంటికి తిరిగొచ్చిన భార్యాభర్తలను పిల్ల ఏదని అడిగితే... ఆ రోజు మెట్ల మీద నుంచి కింద పడి తలకు గాయమైందని, చికిత్స పొందుతూ మరణించిందని తాపీగా సమాధానమిచ్చారు. దీంతో స్థానికులు మీరే బాలికను చంపే శారంటూ భర్తను చితక్కొట్టారు. ఈ మేరకు పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక తల్లి కూడా మెట్లపై నుంచి పడటం వల్లే తన కూతురు మరణించిందని చెబుతోంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు