అది చట్ట విరుద్దమని కోర్టు ఇదివరకే తీర్పిచ్చింది: దత్తాత్రేయ

31 Dec, 2017 12:36 IST|Sakshi

హైదరాబాద్‌: ట్రిపుల్‌ తలాక్‌ చట్ట విరుద్ధమని సుప్రీం కోర్ట్ ఇది వరకే తీర్పు ఇచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ..ఖురాన్‌లో మహిళలు, పురుషులు సమానం అని ఉందని అన్నారు. ట్రిపుల్ తలాక్‌ 14 వందల సంవత్సరాల నుంచి సంప్రదాయంగా సాగుతోందని, ఆ విషయం మీద ముస్లిం మహిళలు ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ పేరు మీద ఎవరినీ జైలు పంపించే ఉద్దేశం  బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సామాజిక న్యాయం మహిళలకు కావాలని అన్నారు.  కాంగ్రెస్ ముస్లింల అభివృద్ధిని ఎప్పుడూ కోరుకోలేదని, కేవలం వారిని ఓటు బ్యాంక్‌గానే చూశాయని విమర్శించారు.

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం పొందిన రోజు చరిత్రాత్మక దినమని అభివర్ణించారు. అసద్ రాజకీయ ఉద్దేశం బీజేపీకి అంటగట్టడం సరైంది కాదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభలో  పాస్ అయినందుకు ఏఐసీసీ మహిళా విభాగ కార్యదర్శి నసీమా బీజేపీలో చేరారని చెప్పారు. 2018 సంవత్సరం బీజేపీకి ఉద్యమాల సంవత్సరం అన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల పై సీఎం కేసీఆర్‌ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడకు పోతుందని విమర్శించారు.
 

మరిన్ని వార్తలు