కుత్బుల్లాపూర్: క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఓ అడ్డాపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1.49 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్వోటీ, పోలీసుల కథనం ప్రకారం.. పద్మానగర్ రింగ్ రోడ్డు వద్ద గత కొంత కాలంగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో పక్కా ప్రణాళికతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి శనివారం రాత్రి బెట్టింగ్లకు పాల్పడుతున్న 8 మందిని వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.49 లక్షల నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందరినీ పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.