క్రిమినల్స్‌కు రెక్కలు!

21 Nov, 2015 00:23 IST|Sakshi
క్రిమినల్స్‌కు రెక్కలు!

దుబాయ్‌కి పరారవుతున్న ఘరానా నేరగాళ్లు
పొరుగు రాష్ట్రాల నుంచి మారుపేర్లతో పాస్‌పోర్ట్స్
మొన్న అయూబ్ ఖాన్, తాజాగా  స్నాచర్ ఖలీఫా

 
సిటీబ్యూరో:  నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అనేక నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న, నాన్-బెయిలబుల్ వారెంట్లు పెం డింగ్‌లో ఉన్న ఘరానా నేరగాళ్లు పరారవుతున్నారు. పొరుగు జిల్లాకో, రాష్ట్రానికో కాదు... ఏకంగా దేశం దాటేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మారుపేర్లతో పాస్‌పోర్టులు తీసుకొని ఎగిరిపోతున్నారు. మొన్నటికి మొన్న కాలాపత్తర్ రౌడీషీటర్ అయూబ్ ఖాన్ దుబాయ్ వెళ్లిపోగా... తాజాగా శాలిబండకు చెందిన ఘరానా స్నాచర్ ఖలీఫా కూడా అక్కడికే చేరుకున్నట్లు సిటీ కాప్స్ గుర్తించాయి.

 షెల్టర్ జోన్స్ నుంచి ‘గుర్తింపులు’...
 సిటీకి చెందిన అనేక మంది నేరగాళ్లకు మహారాష్ట్ర, కర్ణాటకల్లో షెల్టర్స్ జోన్ ఉన్నాయి.  ఇక్కడ నేరం చేసినప్పుడో, పోలీసుల నిఘా/వేట ముమ్మరమైనప్పుడో అక్కడికి వెళ్లి తలదాచుకోవడం వీరికి పరిపాటి. ప్రధానంగా నాందేడ్, గుల్బర్గా తదితరా ప్రాంతాల్లో ఈ షెల్టర్లు ఉంటున్నాయి. కొంతకాలం క్రితం వరకు ఈ ప్రాంతాలను తలదాచుకోవడానికి వినియోగించుకున్న నేరగాళ్లు తాజాగా, నకిలీ పేర్లతో అక్కడి చిరునామాలతో గుర్తింపు పత్రాలు తీసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

 ఒకటి వస్తే చాలు ఇక అన్నీ...
 వివిధ రకాలైన గుర్తింపు పత్రాల జారీలో ఉన్న లోపాలు, పూర్తి స్థాయిలో క్రాస్ చెకింగ్ మెకానిజం లేకపోవడం ఈ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్... ఇలా ఏ ఒక్క గుర్తింపు పత్రాన్ని తీసుకున్నా మిలినవి తీసుకోవడం చాలా తేలికగా మారిపోయింది. దీంతో ఒకదాని వెంట మరోటి చొప్పున గుర్తింపు పత్రాలను తీసుకుంటున్న నేరగాళ్లు వాటి ఆధారంగా బోగస్ పేర్లతో పాస్‌పోర్టులు సైతం పొందుతున్నారు. అక్కడి పోలీసు రికార్డుల ప్రకారం వీరు నేరగాళ్లు కాకపోవడం, ఇక్కడ నేరగాళ్లనే విషయం వారికి తెలియకపోవడంతో తేలిగ్గా వెరిఫికేషన్ సైతం పూర్తయి పాస్‌పోర్టులు నేరగాళ్ల చేతికి చేరుతున్నాయి. వీటిని వినియోగించే విదేశాలకు పారిపోతున్నారని నగర పోలీసులు అనుమానిస్తున్నారు. రౌడీషీటర్ అయూబ్ ఖాన్ విశాఖపట్నం నుంచి పాస్‌పోర్ట్ పొందాడని నిర్థారణ కాగా... ఖలీఫా ఉత్తరాది నుంచి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. నగర పోలీసులు నేరగాళ్లు ఇలా ఎగిరిపోతున్న విధానంతో పాటు దుబాయ్ కేంద్రంగా వీరు సాగిస్తున్న కార్యకలాపాలనూ లోతు గా ఆరా తీస్తున్నారు.
 
అయూబ్ ఖాన్:  ఫతేదర్వాజా ప్రాంతానికి చెం దిన అయూబ్ ఖాన్ 1990లో హుస్సేనీఆలంలో నేరజీవి తాన్ని ప్రారంభిం చా డు. అదే ఏడాది దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో 1991లో హుస్సేనీఆలం పోలీసులు హిస్టరీ షీట్ తెరి చారు. అయూబ్ కాలాపత్తర్‌లోని తాడ్‌బండ్‌కు మకాం మార్చడంతో ఈ షీట్‌ను ఆ ఠాణాకు బదిలీ చేశారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు, అక్రమం గా ఆయుధాలు కలిగి ఉండటం తదితర ఆరోపణలపై నగరంలో వివిధ పోలీసుస్టేషన్లలో 48 కేసులు నమోదు కావడంతో గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటూ బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ఖలీఫా: శాలిబండలోని అలియాబాద్‌కు చెందిన మహ్మద్ అఖీలుద్దీన్ అలియాస్ అఖీల్ అలియాస్ ఖలీఫా పేరు మోసిన స్నాచర్. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఇతడు ఇప్పటి వరకు 83 సార్లు పోలీ సులకు చిక్కి జైలుకెళ్లాడు. ఎస్సార్‌నగర్, పంజగుట్ట, టప్పాచబుత్ర, హుమాయూన్‌నగర్, ఛత్రినాక, సుల్తాన్‌బజార్, చిక్కడపల్లి, మలక్‌పేట, నల్లకుంట, అంబర్‌పేట, కాచి గూడ, సైదాబాద్, మహంకాళి, అఫ్జల్‌గంజ్, నాంపల్లి, ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై బయటకు వచ్చిన ఇతగాడు దుబాయ్‌కి పారిపోయాడు.
 

మరిన్ని వార్తలు