సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన సీవీ ఆనంద్

4 Nov, 2016 19:32 IST|Sakshi
‘చేతులు చాచకుండా బతకలేరా?’

 హైదరాబాద్: పౌరసరఫరాల శాఖలోని అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులపై వస్తున్న విమర్శలు, అవినీతి ఆరోపణలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు తాత్కాలిక ఉద్యోగులపై ఆయన వేటు వేశారు.

పదవీ విరమణ తర్వాత తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్న ఎంఎస్‌ఏ సలీం (కరీంగనర్), జె.భాస్కర్‌రెడ్డి(నల్లగొండ), వి.వెంకటరమణ (ఖమ్మం), ఎం.బాల్‌రెడ్డి (రంగారె డ్డి)లపై ఆయన సస్పెన‍్షన్ వేటు వేశారు. తీరు మారకుంటే రెగ్యులర్ ఉద్యోగులపైనా చర్యలు తప్పవని సీవీ ఆనందర్ హెచ్చరించారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో జిల్లా మేనేజర్లు, టెక్నికల్ సిబ్బందితో సమావేశమైన ఆయన ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు.

‘కార్పొరేషన్ జీతాలు ఇస్తున్నా.. చేతులు చాచకుండా పనిచేయాలేరా.. మీకు ఇదేం రోగం’ అని మండిపడ్డారు. ఒకవైపు కఠినంగా ఉంటున్నామంటుంటే టెక్నికల్ సిబ్బంది ఏకంగా మిల్లర్ల నుంచి పర్సెంటేజీలు పెంచుకుంటూ పోతున్నారా అని నిలదీశారు. ‘ కనీసం 30శాతం మిల్లర్లతో మీరు కుమ్మక్కయ్యారు. ప్రతీ 270 క్వింటాళ్లకు ఒక రేటు ఫిక్స్ చేశారు. మీరెవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకుంటున్నారో నా దగ్గర ఏసీబీ, విజిలెన్స్, ఇంటలిజెన్స్ నివేదికలు ఉన్నాయి.

ఇకపై మీ పద్దతులు మార్చుకోవాల్సిందే..’ అని కమిషనర్ హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి కీలకమైనదని, నిజాయితీగా పనిచేస్తున్న మిల్లర్లను కూడా కొందరు ఉద్యోగులు వదలడం లేదని, తప్పులు చేసే వారిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ‘ కార్పొరేషన్‌ను చంపకండి. బతికించుకోండి. హౌసింగ్ కార్పొరేషన్ పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది కదా..? అ పరిస్థితిని మీరు కొనితెచ్చుకుంటే ఎలా? మిల్లర్ల దగ్గర చేతులు చాపకండి.. వారితో డిన్నర్లు, లంచ్‌లు చేయకండి.. నిజాయితీ పరులను పీడించకండి..’ అని హితవు పలికారు.

మరిన్ని వార్తలు