రెండు రోజుల్లో సాధారణవార్డుకు దాసరి

3 Feb, 2017 18:16 IST|Sakshi
రెండు రోజుల్లో సాధారణవార్డుకు దాసరి
మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ కారణంగా కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం కిమ్స్ వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, రెండు రోజుల్లో సాధారణ వార్డుకు తరలిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన వెంటిలేటర్ మీద ఉండటంతో మాట్లాడలేకపోతున్నారని వివరించారు. 
 
అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ రావడంతో.. వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తొలగించిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉండటంతో దాసరి నారాయణరావును వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. మధ్యలో మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా రావడంతో ఆయనకు డయాలసిస్ చేశారు. దాసరి ఆరోగ్యం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు వాకబు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ యావత్తు కిమ్స్ ఆస్పత్రికి తరలివచ్చి ఆయనను పరామర్శించింది.