-

మే చివరి వారంలో డైట్‌సెట్, ఎడ్‌సెట్‌

11 Apr, 2017 02:14 IST|Sakshi
మే చివరి వారంలో డైట్‌సెట్, ఎడ్‌సెట్‌

- ఈ వారంలోనే నోటిఫికేషన్‌ జారీకి చర్యలు
- లక్షన్నర మంది విద్యార్థులకు ఊరట


సాక్షి, హైదరాబాద్‌: ఏడాదిగా అస్తవ్యస్తంగా తయారైన ఉపాధ్యాయ విద్యా ప్రవేశాలను ఎట్టకేలకు గాడిన పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యు కేషన్‌ (డీఎడ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సుల్లో 2017– 18 విద్యా సంవత్స రంలో ప్రవేశాలకు డైట్‌సెట్, ఎడ్‌సెట్‌ నోటిఫి కేషన్ల జారీకి ఓకే చెప్పింది.ఈ ప్రవేశ పరీక్షలను మే చివరిలో నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులను ఆదేశించింది. మే చివరిలో ఈ పరీక్షలను జరిపితే జూన్‌లో ఫలితాల వెల్లడి, ప్రవేశాల కౌన్సెలింగ్‌ జరపాలంది. జులై 1 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.

సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూ స్తున్న దాదాపు లక్షన్నర మంది విద్యార్థులకు ఊరట కలిగింది. గతేడాది  డీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వమే జీరో ఇయర్‌ చేసింది. దీంతో డీఎడ్‌ కోసం ఎదురుచూసిన వారు విద్యాసంవత్సరం నష్టపోవడంతోపాటు 15 వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. మరోవైపు బీఎడ్‌ కోర్సులో రెండో దశ ప్రవేశాలకు అను మతించలేదు. మేనేజ్‌మెంట్‌ కోటా భర్తీకి ఉత్త ర్వులు జారీ చేయలేదు. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌ లేకుండానే విద్యా సంవత్సరం గడిచిపోయింది.

మేనేజ్‌మెంట్‌ కోటా భర్తీకి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్‌ ఇవ్వకపోయి నా, యాజమాన్యాలే సీట్లను భర్తీ చేసుకున్నా యి. ఫలితంగా మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన 4 వేల మంది విద్యార్థులు, మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరిన మరో 2 వేల మంది విద్యార్థులతో యాజమాన్యాలు కాలే జీలను కొనసాగించాయి. రెండో విడత కౌన్సె లింగ్‌లో భర్తీ చేయాల్సిన 8 వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. దీంతో యాజమాన్యాలు హై కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు చెప్పినా రెండో విడత కౌన్సెలింగ్‌ చేపట్టకుండా ఆ తీర్పుపై ఉన్నత విద్యాశాఖ గత జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇలా విద్యా సంవత్సరం కూడా గడిచిపోయింది. దీంతో 2017–18 విద్యా సంవత్సరంలో బీఎడ్‌లో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌ నిర్వహణ అంశాన్ని కూడా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. గత జనవరిలో అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించినా ఎడ్‌సెట్‌–2017 నిర్వహణకు నియమించలేదు. గతేడాది డీఎడ్‌ కు జీరో ఇయర్‌ చేసిన ప్రభుత్వం ఈసారి బీఎడ్‌కు అలానే చేస్తుందా? అనే ఆందోళనతో వివిధ సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. దీంతో 2017–18లో డీఎడ్, బీఎడ్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

గత ఏడాది బీఎడ్‌ మేనేజ్‌మెంట్‌ కోటాలో యాజమాన్యాలే భర్తీ చేసుకున్న సీట్లకు ర్యాటిఫికేషన్‌ ఇవ్వనుంది. వర్సిటీల వీసీలతో సమావేశం జరిపి, ఎడ్‌సెట్‌–2017కు కన్వీనర్‌ను నియమించడంతోపాటు నోటిఫి కేషన్‌ జారీకి చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి అధికారులను ఆదేశించింది. మరోవైపు డైట్‌సెట్‌–2017కు ఇప్పటికే కన్వీనర్‌గా శేషుకుమారిని నియమించిన ప్రభుత్వం ప్రవేశాల మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్‌ వెలువడనుంది.

మరిన్ని వార్తలు