'కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి'

12 Jan, 2016 15:14 IST|Sakshi

హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలపై నగర కాంగ్రెస్ పార్టీ నాయకులతో దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ....  టీఆర్ఎస్ పార్టీది కుటుంబపాలన అని అభివర్ణించారు.

పేదల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. 2019లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు.

అలాగే ఈ బేటీలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..  టీడీపీకి ఓటు వేస్తే అది వృధానే అని చెప్పారు. ఇక తెలంగాణలో టీడీపీ కనుమరుగే అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్కి టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదన్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ శాసనసభలో శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ... సెటిలర్లను భయబ్రాంతులకు గురి చేసింది టీఆర్ఎస్ పార్టీనే అని గుర్తు చేశారు. సెటిలర్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది.... ఇకపై నిలబడుతుందని జానారెడ్డి హామీ ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతోందని జానారెడ్డి ఆరోపించారు.

మరిన్ని వార్తలు