ఆ పుకార్లు నమ్మొద్దు

30 Dec, 2017 09:03 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌), జర్నలిస్టు హెల్త్‌ స్కీం(జేహెచ్‌ఎస్‌) లబ్దిదారులకు వైద్యసేవలు నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఈహెచ్‌ఎస్‌ సీఈఓ డాక్టర్‌ పద్మ అన్నారు. నెట్‌వర్క్‌ పరిధిలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు సహా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పూర్తిస్థాయి వైద్యసేవలు అందుతున్నాయన్నారు. వైద్యసేవలు అందడం లేదని వస్తున్న పుకార్లను నమ్మవద్దని లబ్దిదారులకు సూచించారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఆయా ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు పొందవచ్చునని సూచించారు. వైద్య ఖర్చుల విషయంలో ఎలాంటి పరిమితి లేదని, లబ్దిదారుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. 

ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తే చాలు
ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌ లబ్దిదారులు వైద్యసేవలు అందించేందుకు నెట్‌వర్క్‌ పరిధిలో 269 ప్రైవేటు, 65 ప్రభుత్వ, 18 కార్పొరేట్‌ ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. 12 లక్షల మంది లబ్డిదారులు ఉండగా ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల మంది ఓపీ సేవలు వినియోగించుకున్నారు. 1.70 లక్షల మందికి పైగా ఇన్‌ పేషెంట్‌ సర్వీసులు పొందారు. అత్యవసర పరిస్థితుల్లో లబ్దిదారులు ఆయా ఆస్పత్రులకు నేరుగా వెళ్లి అడ్మిట్‌ కావొ చ్చు, రోగి వివరాలు ఆయా ఆస్పత్రులు ఆన్‌ లైన్‌ ద్వారా ట్రస్ట్‌కు చేరవేస్తాయి. సర్జరీ అనివార్యమైతే ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తే సరి పోతుంది.

త్వరలో బయోమెట్రిక్‌ విధానంః ఖైరతాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లో రోజు సగటు ఓపీ 1100 నుంచి 1200 నమోదు అవుతుండగా, వనస్థలిపురంలో 600 నుంచి 700, వరంగల్‌ సెంటర్‌లో 300 నుంచి 400 నమోదు అవుతుంది. రోజుకు 200 మంది ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. ఆయా కేంద్రాల్లో రోగుల నిష్ప త్తికి తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో కొంత ఇబ్బ ందులు ఎదురవుతున్నాయి. వచ్చిన రోగి ఎక్కువ సేపు నిరీ క్షించాల్సిన అవసరం లేకుండా బయోమెట్రిక్‌ విధానం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం. కూకట్‌పల్లి, పాతబస్తీ వెల్‌నెస్‌ సెంటర్లను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాం’ అని సీఈఓ డాక్టర్‌ పద్మ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు