క్షణక్షణం

10 Feb, 2016 00:21 IST|Sakshi

హిమాయత్‌నగర్ టు మొయినాబాద్
డాక్టర్ల ఘటన పూర్వాపరాలు ఇవీ
..
 
 సిటీబ్యూరో: డాక్టర్ల త్రయం ఉదయ్ కుమార్, శశికుమార్, సాయికుమార్‌ల వ్యవహారం సోమవారం సాయంత్రం హిమాయత్ నగర్‌లో ఉదయ్ కుమార్‌పై హత్యా యత్నంతో ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మొయినాబాద్‌లోని నిష్ ఫామ్‌హౌస్‌లో శశికుమార్ ఆత్మహత్యతో ఆగింది. ఈ మధ్య కాలంలో ఏ క్షణం ఏం జరిగిందనేది పోలీసుల కథనం ప్రకారం...
 
సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలు
మినర్వా కాఫీ షాప్ దగ్గర ఉదయ్, శశి, సాయి కలుసుకున్నారు. అక్కడ శశి దోశ తినగా... మిగిలిన ఇద్దరూ కాఫీ తాగారు.
4.30: ఈ ముగ్గురి మధ్యా వాగ్వాదం చోటు చేసుకోవడంతో కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చి కారులో స్ట్రీట్ నెం.6లోకి వెళ్లారు.
4.40: ఆవేశానికి లోనైన శశికుమార్ తన .32 లెసైన్స్‌డ్ రివాల్వర్‌తో ఉదయ్‌పై కాల్పులు జరిపాడు.
5.15: చికిత్స కోసం ఉదయ్ కుమార్ తనంతట తానుగా హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులకు సమాచారం అందింది.
6.15: శశికుమార్ సోమాజిగూడలోని స్నేహితురాలు చంద్రకళ ఇంటికి వెళ్లారు.
6.30:  సోమాజిగూడ నుంచి చంద్రకళ, శశికుమార్‌లు మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు.
రాత్రి 7.45: దారిలో షాపింగ్ చేసుకుంటూ వీరిద్దరూ నక్కలపల్లిలో ఉన్న నిష్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.
8.00: శశికుమార్‌ను అక్కడే వదిలిన చంద్రకళ తన కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
9.30: ఇంటికి చేరుకున్న చంద్రకళ రెండుసార్లు వాచ్‌మెన్ నెంబర్‌కు ఫోన్ చేసి శశికుమార్‌తో మాట్లాడారు.
9.45: ఉదయ్ కుమార్‌పై కాల్పులు, శశికుమార్ వాంటెడ్ వివరాలను టీవీల్లో చూసిన చంద్రకళ షాక్‌కు గురయ్యారు.
10.15: తనకు పరిచయస్తుడైన ఓ ఆర్మీ అధికారి సాయంతో పంజగుట్ట పోలీసు స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పారు.
11.10: పంజగుట్ట పోలీసు స్టేషన్‌కు వచ్చిన నారాయణగూడ పోలీసులు చంద్రకళతో కలిసి ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు.
12.50: నిష్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్న పోలీసు బృందం శశికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించింది.
మంగళవారం ఉదయం 10.30శశికుమార్ మృతదేహాన్ని మొయినాబాద్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
మధ్యాహ్నం 1.30: పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసిన ఫోరెన్సిక్ వైద్యులు శశికుమార్ మృతదేహాన్ని ఆయన సోదరుడికి అప్పగించారు.

మరిన్ని వార్తలు