ప్యాసింజర్ల ప్రాణాలతో డ్రైవర్ల చెలగాటం!

25 Mar, 2017 20:01 IST|Sakshi
ప్యాసింజర్ల ప్రాణాలతో డ్రైవర్ల చెలగాటం!

హైదరాబాద్‌: ఆదాయం కోసం ఆర్టీసీ బస్సుల సిబ్బంది మధ్య పోటీ తీవ్రమైంది. డ్రైవర్లు పరస్పరం పోటీపడుతూ ప్రయాణికుల ప్రాణాలమీదికి తెస్తున్నారు. తాజాగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన వివరాలివీ. శనివారం మధ్యాహ్నం కర్ణాటకకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఎంజీబీఎస్‌కు చేరుకున్నాయి. ఒకే ప్లాట్‌ఫాం వద్ద ఒకదాని వెనుక మరొకటి ఆగాయి. ముందుగా ఆగిన బస్సులో ప్రయాణికులంతా ఎక్కారు. దీంతో వెనుక ఉన్న బస్సు డ్రైవర్‌ ముందున్న బస్సులో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు యత్నించాడు. దీంతో రెండు బస్సుల డ్రైవర్ల మధ్య గొడవ మొదలైంది.

ఈ క్రమంలో కోపంతో ఉన్న మొదటి బస్సు డ్రైవర్‌ వేగంగా బస్సును వెనక్కి నడిపారు. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు. దీంతో ఆ డ్రైవర్‌ వెంటనే బ్రేక్‌ వేశారు. లేకపోయినట్లయితే వెనుక బస్సును ఢీకొట్టి ప్రమాదం సంభవించి ఉండేది. విషయం తెలుసుకున్న వెంటనే కంట్రోలర్‌ భూమయ్య అక్కడికి చేరుకొని వారిని సముదాయించి పంపించారు. బస్సుల మధ్య ఆదాయం పోటీ ప్రయాణికుల ప్రాణాల మీదికి వస్తోంది. ఈ విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు