మీడియా సంస్థ ఐడీకార్డుతోనైనా సచివాలయంలోకి అనుమతి

24 Feb, 2016 00:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : అక్రెడిటేషన్ కార్డు లేకపోయినా మీడియా సంస్థ గుర్తింపు కార్డు తో సెక్రటేరియట్‌లో ప్రవేశానికి అనుమతిస్తామని తెలంగాణ సచివాలయం భద్రతా విభాగం స్పష్టంచేసింది. అక్రెడిటేషన్ కార్డు లేదన్న కారణంతో సోమవారం సాక్షి జర్నలిస్టు భువనేశ్వరి సహా అనేక మంది పాత్రికేయులకు అనుమతి నిరాకరించింది.

మంగళవారం సచివాలయంలో పాత్రికేయులు నిరసనకు దిగి భద్రతాసిబ్బంది వైఖరిని ఖండించారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన ముఖ్య భద్రతాధికారి జర్నలిస్టులు పనిచేసే సంస్థ గుర్తింపు కార్డు ఉన్నా లోపలికి అనుమతిస్తామని ప్రకటించారు. దీంతో జర్నలిస్టులు తమ నిరసన కార్యక్రమాన్ని విరమించారు. పాత నిబంధనలను పాటించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఇకపై ఇలా జరగకుండా చూస్తామని ముఖ్య భద్రతాధికారి హామీ ఇచ్చారు. సంస్థ గుర్తింపు కార్డు చూపించినా సెక్రటేరియట్‌లోకి అనుమతించని సాక్షి జర్నలిస్టుకుక్షమాపణలు చెప్పారు.

మరిన్ని వార్తలు