బాలానగర్, న్యూస్లైన్: ‘మా అమ్మకన్నా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా... నీ కోసం ప్రాణమైన ఇస్తా.. అని ప్రియురాలికి మెసేజ్ పెట్టి ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలానగర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన చక్రపాణి కుమారుడు సూరిశెట్టి రాకేశ్ (23) ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గతనెలలో రంగారెడ్డినగర్ పంచశీలకాలనీలో ఉంటున్న తన స్నేహితుడు ఎస్కే వజీద్ అహ్మద్ రూమ్కు వచ్చాడు.
అప్పట్నుంచి ఉద్యోగం కోసం అన్వేషిస్తూ రూమ్కే పరిమితమయ్యాడు. రూమ్మేట్స్ వజీద్, చంద్లు ఆదివారం సాయంత్రం డ్యూటీకి వెళ్లగా, రాత్రి 7 గంటలకు రాకేశ్.. వజీద్కు ఫోన్ చేసి ఎంతసేపులో వస్తావని అడిగాడు. ఆలస్యం అవుతుందని స్నేహితుడు చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు. తర్వాత గదిలోకి వెళ్లిన రాకేశ్ తలుపు దగ్గరకు జారవేసి.. సీలింగ్ఫ్యాన్కు దుప్పటితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
డ్యూటీ ముగించుకొని వచ్చిన స్నేహితులు తలుపు తెరిచి చూడగా.. రాకేశ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూమ్లో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. రాకేశ్ సెల్ఫోన్ను పరిశీలించగా నెల్లూరుకుచెందిన ప్రియురాలి సెల్ కు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఐదుసార్లు మెసేజ్లు పంపినట్టు ఉంది.
‘దయచేసి నాఫోన్ ఎత్తు అని ఒక సారి, మా అమ్మకన్నా.. నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా అని మరోసారి, నువ్వు చనిపోమ్మంటే ఇప్పుడే చనిపోతా, నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఇంకోసారి, నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా ఆత్మహత్యకు నీకు సంబంధం లేకుండా మెసేజ్లు తీసేస్తా’ అని చివరి మెసేజ్లో ఉంది. ఆ అమ్మాయి తనను ప్రేమించకపోవడం, ఆర్థిక సమస్యల కారణంతో రాకేశ్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.