ప్రతి ఐదుగురిలో ఒకరు హృద్రోగి

17 Apr, 2016 01:41 IST|Sakshi
ప్రతి ఐదుగురిలో ఒకరు హృద్రోగి

* 2020 నాటికి ఈ పరిస్థితి తప్పదు
* సీఎస్‌ఐ ఎన్‌ఐసీ-2016 సదస్సు హెచ్చరిక
* అంతర్జాతీయ మార్కెట్లో 4 దేశీయ స్టెంట్లకు గుర్తింపు

సాక్షి, హైదరాబాద్: 2020 నాటికి దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడే ప్రమాదం ఉందని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్‌ఐ)-నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్(ఎన్‌ఐసీ)-2016 సదస్సు హెచ్చరించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 17-18 శాతం వివిధ రకాల హృద్రోగ సంబంధిత  సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో భారీ నష్టాలనే చవిచూడాల్సి వస్తోందని పేర్కొంది. శనివారం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్‌ఐ)- నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్(ఎన్‌ఐసీ)-2016 సదస్సుకు దేశవిదేశాల నుంచి 2,500 మంది హృద్రోగ నిపుణులు హాజరయ్యారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగంలో అందివచ్చిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, యాంజియోప్లాస్టీ ప్రొసీజర్స్ టెక్నిక్స్ వంటి అంశాలపై ఆయా రంగాల నిపుణులు చర్చించారు. గత ఏడాది యాంజియోప్లాస్టీ చేయించుకున్న వారిలో 40 ఏళ్లలోపు వారు 10 శాతం ఉంటే, 70 ఏళ్లలోపు వారు 75 శాతం.. ఆ తర్వాత ఏజ్‌గ్రూప్ వారు మరో 15 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది.   
 
3.5లక్షల మందికి యాంజియోప్లాస్టీ: ఎన్‌ఎన్ ఖన్నా, చైర్మన్, ఎన్‌ఐసీ
హృద్రోగ సమస్యలను అంచనా వేసేందుకు నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 2015లో దేశవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టాం. 630 ఆస్పత్రుల నుంచి వివరాలు సేకరించాం. గత ఏడాది 3.5 లక్షల మంది హృద్రోగులకు యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ చేసినట్లు తేలింది. మరో 4.75 లక్షల మంది రోగులు స్టెంట్లు వేయించుకున్నారు. వీరిలో 95 శాతం మంది డ్రగ్ కొటేడ్ స్టెంట్లు వేయించుకున్నట్లు స్పష్టమైంది.  
 
దేశీయ స్టెంట్లే ఉత్తమం: జె.శివకుమార్, ఆర్గనైజింగ్ కార్యద ర్శి, ఎన్‌ఐసీ
దేశంలో 9 కంపెనీలు స్టెంట్లను తయారు చేస్తుండగా, వీటిలో ఇప్పటికే 4 కంపెనీల స్టెంట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉన్నట్లు గుర్తింపు లభించింది. ఇక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాలకు స్టెంట్లు ఎగుమతి అవుతున్నాయి. వీటి ద్వారా దేశానికి ఏటా 32 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. చాలామంది ఇప్పటికీ విదేశీ స్టెంట్లపైనే ఆసక్తి చూపుతున్నారు. నిజానికి దేశీయ డ్రగ్ కొటెడ్ స్టెంట్లే ఉత్తమం.  
 
జీవనశైలిలో మార్పు వల్లే: ఎస్.గుహ, అధ్యక్షుడు, ఎన్‌ఐసీ
ప్రస్తుతం హృద్రోగ బాధితుల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు 60-70 ఏళ్ల వారిలో వెలుగు చూసే హృద్రోగ సమస్యలు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం పదమూడేళ్లకే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు పట్టణ వాసుల్లోనే ఈ సమస్యలు ఎక్కువగా కన్పించేవి. ఫాస్ట్‌ఫుడ్, స్మోకింగ్, ఆల ్కహాల్ కల్చర్ నేడు మారుమూల పల్లెలకూ విస్తరించడంతో వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

మరిన్ని వార్తలు