సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత

17 Jan, 2016 16:10 IST|Sakshi
సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత

హైదరాబాద్: సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత వీ రామారావు(80) ఆదివారం కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. 2002- 2005 మధ్య కాలంలో సిక్కింకు గవర్నర్ గా పనిచేసిన ఆయన.. ఆ పదవి నిర్వహించిన అతికొద్దిమంది తెలుగువారిలో ఒకరు. రామారావు మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు.

రామారావు స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం. ఆయన 1935 డిసెంబర్ 12న ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. ఆయన స్వస్థలం మచిలీపట్నం అయినా హైదరాబాద్ బీజేపీ నేతగానే ప్రసిద్ధులయ్యారు. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు (1966, 1972, 1978, 1984ల్లో) ఎమ్మెల్సీగా గెలుపొందారు. మండలిలో బీజేపీ పక్షనాయకుడిగానూ సేవలందించారు. రామారావు మృతి పట్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్తో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు