అభ్యంతరకర దృశ్యాలను తొలగిస్తాం

2 Dec, 2016 15:12 IST|Sakshi
హైదరాబాద్: ఇంటర్నెట్‌లో ఉంచిన ట్రైలర్, టీజర్లనుంచి అభ్యంతరాలున్న దృశ్యాలను తొలగిస్తామని వంగవీటి చిత్రం దర్శక, నిర్మాతలు హైకోర్టుకు తెలిపారు. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన వంగవీటి అనే సినిమా వాస్తవాలకు విరుద్ధంగా ఉందని, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) ఆమోదం లేకుండా ట్రైలర్, టీజర్లను ఇంటర్నెట్, యూట్యూబ్, ట్విట్టర్‌లలో ప్రదర్శిస్తున్నారంటూ దివంగత వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై హైకోర్టు న్యాయమూర్తి రాజా ఇలంగో గత మంగళవారంవిచారణ జరపగా వంగవీటి రంగా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నామని చెబుతున్నా ట్రైలర్‌ను చూస్తే వాస్తవాలను వక్రీకరించేలా ఉందని రాధాకృష్ణ తరపు న్యాయవాది బండి వీరాంజనేయులు కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విజయవాడ పోలీసు కమిషనర్, సీబీఎఫ్‌సీ, రాంగోపాల్‌వర్మ, దాసరి కిరణ్‌కుమార్ తదితరులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా, శుక్రవారం విచారణ సందర్భంగా పిటిషనర్ అభ్యంతరాలను పరిశీలించి ఆ దృశ్యాలను తొలగిస్తామని దర్శక, నిర్మాతలు కోర్టుకు తెలిపారు.
మరిన్ని వార్తలు