ఫేస్‌‘బుక్కై’పోతున్నారు!

30 May, 2016 23:56 IST|Sakshi
ఫేస్‌‘బుక్కై’పోతున్నారు!

జానకి ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం
ఈ ‘పేజీలను’ అడ్డంపెట్టుకుని వంచనలూ
అపరిచిత స్నేహాలు వద్దంటున్న పోలీసులు

 

సిటీబ్యూరో: సిటీలో తొలి ‘ఫేస్‌బుక్ మర్డర్’ రికార్డులకెక్కింది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న జానకి-ట్యాక్స్ కన్సల్టెంట్ యశ్వంత్ కుమార్ ఉదంతం ఈ కోవకు చెందినదే. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన జానకితో సాన్నిహిత్యం పెంచుకుని మోసం చేసిన యశ్వంత్ ఆపై దారుణంగా హత్య చేశాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ హత్యతో పాటు ఫేస్‌బుక్ ఆధారంగా జరుగుతున్న ఘోరాలు సిటీలో అనేకం ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు... ముఖ్యంగా యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

 
అతడో సైబర్ శాడిస్ట్...

బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నివసించే అబ్దుల్ మాజిద్ రెండేళ్లుగా ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతా లు తెరిచాడు. సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినుల ప్రొఫైల్స్‌ను గుర్తించి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపిస్తాడు. అవతలి వారు కూడా అమ్మాయిలే అనే ఉద్దేశంతో విద్యార్థినులు ‘యాక్సెప్ట్’ చేయడంతో అసలు కథ మొదలెడతాడు. వారితో స్నేహపూరితంగానే ఛాటింగ్ చేస్తూ వ్యక్తిగత విషయాలు అడుగుతాడు.  ఇలా స్నేహం పెరిగిన తర్వాత వారి ఆంతరంగిక అంశాల్లోకీ తలదూర్చుతాడు. విద్యార్థినుల్ని వంచిస్తూ వారి నగ్న చిత్రాలు, వీడియోలు సంగ్రహిస్తాడు. ప్రైవేట్ ఛాటింగ్ ద్వారా అసభ్యకరమైన సంభాషణలు కొనసాగిస్తాడు. ఆ తర్వాత తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పెట్టడంతో పాటు తల్లిదండ్రులకూ పంపుతానంటూ వారిని బెదిరిస్తూ అందినకాడికి దండుకుంటాడు. మాజిద్‌ను గతేడాది సెప్టెంబర్ 11న సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడు దాదాపు 80 మందిని వంచించినట్లు ఆరోపణలున్నాయి. జైలు నుంచి వచ్చినా అదే పంథాలో రెచ్చిపోతూ ఈ ఏడాది ఏప్రిల్‌లో మళ్లీ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు.

 
చాటింగ్స్‌తో మొదలెట్టి ...

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బాబూరావు ఫేస్‌బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాలైన ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తాడు. అందులో తన ఈ-మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నెంబర్ సైతం పొందుపరుస్తాడు. ఆసక్తికనబరుస్తూ దరఖాస్తు చేసిన వారిలో యువతులు, మహిళల్ని ఎంచుకుంటాడు. దరఖాస్తు పత్రాల్లో ఉన్న వారి ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలు తీసుకుంటాడు. వీటి ఆధారంగా వారిలో చాటింగ్ చేయడం ప్రారంభిస్తాడు. తొలుత ఉద్యోగానికి సంబంధించిన విషయాలే చర్చించే బాబూరావు... కొన్నాళ్లకు వారిని మాయజేస్తూ వ్యక్తిగత అంశాలతో పాటు అభ్యంతరకర, అశ్లీల సందేశాలూ పంపిస్తుంటాడు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత సదరు యువతి/మహిళకు ఫోన్లు చేసి ‘చాటింగ్’ వివరాలకు కుటుంబీకులు, సంబంధీకులకు చెప్తానంటూ బ్లాక్‌మెయిలింగ్ మొదలెడతాడు. అలా కాకుండా ఉండాలంటే తాను అడిగినంతా ఇవ్వాలంటూ అందినంత మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ నగర విద్యార్థిని ఫిర్యాదుతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేశారు.

 
స్నేహం ముసుగులో వంచన...

‘ఫేస్‌బుక్ మర్డర్’ జానకి ఉదంతం వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందే నగరంలో ‘ఫేస్‌బుక్ రేప్’ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ టోలిచౌకిలోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ఇతడికి ఫేస్‌బుక్ ద్వారా సమీపం ప్రాంతంలో నివసించే ఓ యువతి పరిచయమైంది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తు న్న ఆమెతో కొన్ని రోజుల పాటు స్నేహం నటిం చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. స్వయంగా వెళ్లి కారులో ఎక్కించుకుని వచ్చాడు. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకు న్న ఈ నయవంచకుడు కూల్‌డ్రింక్‌లో మత్తు మం దు కలిపి స్ఫృహతప్పేలా చేశాడు. ఆపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు యువతిని తీసుకురావడానికి వినియోగించిన కారునూ స్వాధీనం చేసుకున్నారు.

 
యువతులూ తక్కువేం కాదు..

ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి యువకుల్ని ఆకర్షిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్న ఇద్ద రు యువతులూ నగరంలో పట్టుబడ్డారు. పాతబస్తీలోని పత్తర్‌గట్టీ, రికాబ్‌గంజ్‌లకు చెందిన ఇద్దరు యువతులు స్నేహితులు. వీరిద్దరూ తప్పిపోయారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని పట్టుకున్నాక అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలతో వీరు ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా యువకుల్ని ఆకర్షిస్తూ వారితో స్నేహం, చాటింగ్ చేస్తూ ముగ్గులోకి దింపారు. ఆ యువకుల నుంచి నగదు, నగలు, కెమెరాలు, ఫోన్లు రాబట్టుకున్నారు. ఆ డబ్బుతో డెహ్రా డూన్, ఊటీ, వైజాగ్‌ల్లో జల్సాలు చేస్తుండేవారు. ఈ పంథాలో వీరిద్దరూ 17 మంది యువకుల్ని మోసం చేశారు.

మరిన్ని వార్తలు