‘ఆర్డీఎస్‌’ ఈసారీ అంతే!

14 Jun, 2017 01:49 IST|Sakshi
- ఈ ఏడాదీ జరగని ఆధునీకరణ పనులు.. కాల్వల ఎత్తు పెంపునకు ఏపీ ససేమిరా
- వచ్చే ఏడాది వరకు రైతులకు తప్పని నిరీక్షణ  
 
సాక్షి, హైదరాబాద్‌: రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్‌డీఎస్‌) కింది ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాదీ నిరాశే మిగలనుంది. మూడే ళ్లుగా ఊరిస్తున్న ఆధునీకరణ పనులు ఈ ఏడాదీ మూలన పడ్డాయి. పనుల పూర్తికి కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చినా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలతో కాల్వల ఎత్తు పెంపు సాధ్యం కాలేదు. ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉండగా పాత పాలమూరు జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీల మేర నీరు లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావట్లేదు.

ఈ దృష్ట్యా ఆర్డీఎస్‌ కాల్వలకు మరమ్మతులు చేసి ఎత్తు పెంచాలని నిర్ణయించగా ఇందుకు కర్ణాటక సర్కారు అంగీకరించింది. దీంతో కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు తెలంగాణ ప్రభుత్వం రూ. 72 కోట్ల నిధులను డిపాజిట్‌ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు మూడేళ్లుగా అడ్డుపడుతున్నారు. గతేడాది దీనిపై మంత్రి హరీశ్‌రావు స్వయంగా కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అక్కడ సానుకూలత వచ్చింది. ప్యాకేజీ–1లో ని హెడ్‌వర్క్స్‌ అంచనాను రూ. 13 కోట్లకు పెంచగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 
ఏపీ సర్కారు మోకాలడ్డు...
తుంగభద్ర బోర్డు సమావేశంలో ఆర్డీఎస్‌ కాల్వల్లో పూడికతీత, కాల్వల మరమ్మతులకు అంగీకరించిన ఏపీ.. కట్ట ఎత్తు పెంచుకునేం దుకు మాత్రం అంగీకరించలేదు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఏపీకి తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించిన దృష్ట్యా ఆ నీటిని ఆర్డీఎస్‌ కుడి కాల్వ ద్వారా తీసుకో వచ్చని తెలంగాణ చెప్పినా కూడా ఏపీ సర్కారు వినిపించుకోలేదు. ఈ అంశంపై మరోసారి చర్చల్లో ఏపీని ఒప్పించి పనులు మొదలుపెడదామన్నా వర్షాకాలం మొదలు కావడంతో తుంగభద్ర కాల్వల్లో నీరు చేరే పరిస్థితులున్నాయి. 
>
మరిన్ని వార్తలు