దిగ్విజయ్‌ను తెలంగాణలో తిరగనీయం!

3 May, 2017 01:53 IST|Sakshi
దిగ్విజయ్‌ను తెలంగాణలో తిరగనీయం!

ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్, పార్టీ నేత బుడన్‌ బేగ్‌  
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలోని అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నుంచి ముస్లిం మైనారిటీలను దూరం చేయాలని కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ అన్నారు. ఆ పార్టీ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమని, ఆయన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసులకు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో తిరగనీయమని హెచ్చరించారు. పార్టీ సీనియర్‌ నాయకుడు బుడన్‌ బేగ్‌తో కలసి మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ముస్లింలను టీఆర్‌ఎస్‌కు దూరం చేయాలని కాంగ్రెస్‌ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.

దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దిగ్విజయ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్ణాటక రాష్ట్రం నుంచి దిగ్విజయ్‌ను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగించిన మాదిరిగానే తెలంగాణ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి కూడా తొలగించాలని కాంగ్రెస్‌ హై కమాండ్‌కు సూచించారు. తెలంగాణ పోలీసులు సమర్ధంగా పనిచేస్తుంటే ఓర్వలేక పోతున్నారని ఆయన విమర్శించారు.

>
మరిన్ని వార్తలు