ఉదాసీనతే అక్రమాలకు ఊతం!

4 Jun, 2017 02:21 IST|Sakshi
ఉదాసీనతే అక్రమాలకు ఊతం!
- కట్టుకథలతో కమిషనర్‌ కళ్లకు గంతలు
- సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఫీల్‌గుడ్‌ కలరింగ్‌
- ఆయన ఆదేశాల కంటే తామే మెరుగ్గా ఆడిట్‌ చేయించామన్న డీఐజీలు
 
సాక్షి, హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో రోజురోజుకూ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూమాయలో పలువురు సబ్‌రిజిస్ట్రార్ల లీలలు బట్టబయలైన విషయం తెలిసిందే. తాజాగా ఆ శాఖ ఉన్నతాధికారి ఉదాసీనతే అనేక అక్రమాలకు ఊతమిచ్చిందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(సీఐజీ)కళ్లకు కొంతమంది అధికారులు గంతలు కట్టారు. కమిషనర్‌ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో, 12 జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజువారీ వ్యవహారాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయంటూ కొందరు డీఐజీలు, మరికొందరు జిల్లా రిజిస్ట్రార్లు రెండేళ్లుగా కప్పిపుచ్చారు.

పరిపాలన పరంగా కమిషనర్‌ అడపాదడపా ఇస్తున్న ఆదేశాల కంటే మెరుగైన ఆదేశాలిచ్చి క్షేత్రస్థాయి సిబ్బందిని తమ అదుపాజ్ఞల్లోనే ఉంచుకుంటున్నామంటూ కమిషనర్‌కు కట్టుకథలు చెప్పి మభ్యపెట్టారు. దీంతో రెండేళ్లుగా కమిషనర్‌ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ప్రతిఏటా రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరగడంతో వచ్చిన క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటున్న కమిషనర్‌ ఆ శాఖలో అక్రమాలను పసిగట్టడంలో పూర్తిగా విఫలమయ్యా రనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చినా, తన చేతికి మకిలి అంటకూడద న్నట్లుగా ప్రభుత్వానికి ఒక నివేదిక పంపి చేతులు దులిపేసుకున్నారు. 10 రోజులుగా ప్రభు త్వ భూముల కుంభ కోణం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాల్లో అక్రమ రిజిస్ట్రేష న్లు, పలువురు సబ్‌ రిజి స్ట్రార్లు అరెస్ట్‌ వంటి సంఘ టనలు చోటు చేసుకుంటు న్నా కమిషనర్‌ ఒక్కరోజు కూడా కార్యాలయానికి రాకపోవడం గమనార్హం. 
 
మెరుగు పర్చారా.. బలహీన పర్చారా!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, బాలా నగర్, ఎల్బీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా మీడియాలో వార్తలు రావడంతో అక్రమాలను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ) ఆరు నెలల కిందటే హుకూం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు జిల్లా(ఆడిట్‌)రిజిస్ట్రార్లతో ప్రత్యేక ఆడిట్‌ టీమ్‌ను ఏర్పాటు చేస్తూ గత ఫిబ్రవరిలో కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. జూన్‌ 2లోగా నివేదిక సమర్పించాలని ఆ టీమ్‌కు దిశానిర్దేశం కూడా చేశారు.

కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవని, ఆయన చెప్పిన దానికంటే మెరుగ్గా ఆడిట్‌ చేయించేందుకు తాము రెండు బృందాలను ఏర్పాటు చేశామని రంగారెడ్డి జిల్లాకు చెందిన డీఐజీ ఒకరు చెబుతున్నారు. కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలను మీరెలా రద్దు చేస్తారని ఆయనను ప్రశ్నిస్తే, కమిషనర్‌ ఆదేశాలు రద్దు చేయలేదని, ఆడిట్‌ ప్రక్రియను మెరుగుపరచామని బుకాయించారు. వాస్తవానికి కమిషనర్‌ ఏర్పాటు చేసిన ఆడిట్‌ టీమ్‌ను తనిఖీలకు పంపితే తమ బండారాలు బయటపడతాయనే కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు, డీఐజీపై ఒత్తిడి తెచ్చి బలహీనమైన తనిఖీ బృందాలను వేయించుకున్నారని రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది అంటున్నారు.  
మరిన్ని వార్తలు