ఇంజనీరింగ్ ఫీజుల మోత

6 Jul, 2016 02:01 IST|Sakshi
ఇంజనీరింగ్ ఫీజుల మోత

- సాధారణ కాలేజీల్లోనూ భారీగా ఫీజుల ఖరారు
- ఎక్కువ కాలేజీల్లో ఫీజులు రూ. 60 వేలకు పైగానే..
- పలు కాలేజీల్లో పాత ఫీజులపై అదనంగా రూ. 25 వేల వరకు పెంపు
- 2016-17 నుంచి కాలేజీల్లో చేరే వారికి కొత్త ఫీజులు
- ఇప్పటికే చదువుతున్న వారికి పాత ఫీజులే వర్తింపు
- అత్యధిక ఫీజు ఫార్మ్-డిలో 1.15 లక్షలు, ఇంజనీరింగ్‌లో 1,13,500

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న సాధారణ, ఓ మోస్తరు కాలేజీల్లో 80 శాతం వరకు ఫీజు పెంచారు. కొన్ని కాలేజీల్లో మాత్రం ఇప్పటివరకు ఉన్న ఫీజులను యథాతథంగా ఉంచారు. ఇప్పటివరకు ఎక్కువ కాలేజీల్లో రూ.35 వేల కనీస ఫీజు ఉండగా.. తాజాగా రూ.60 వేల వరకు చేరింది. గతంలో రూ.50 వేలలోపు ఫీజు ఉన్న కాలేజీల్లో రూ.75 వేల వరకు పెంచారు. కొన్ని టాప్ కాలేజీల్లోనూ ఫీజులు భారీగా పెంచారు. కొన్నింటి ఫీజుల్లో కోత పెట్టారు. మొత్తంగా ఇంజనీరింగ్‌లో కనీస ఫీజు రూ.35,000 కాగా, గరిష్ట ఫీజు రూ.1,13,500గా... ఫార్మ్-డిలో గరిష్ట ఫీజు రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే చదువుతున్నవారికి పాత ఫీజులే ఉంటాయి. 2016-17 నుంచి కాలేజీల్లో చేరే వారికి కొత్త ఫీజులు వర్తిస్తాయి. కాలేజీలవారీగా ఫీజుల వివరాలను సాక్షి ఎడ్యుకేషన్ డాట్‌కామ్ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
 
 గుర్తింపు లభించిన కాలేజీలకే..
 రాష్ట్రంలో 293 ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో వసూలు చేయాల్సిన వార్షిక ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం జీవో 21 జారీ చేశారు. ఫీజుల ఖరారు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలన్నింటికీ కాకుండా ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపటే ్టందుకు అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీలకు మాత్రమే ఫీజులను ఖరారు చేశారు. ఇందులో 179 ఇంజనీరింగ్ (బీటెక్) కాలేజీలు, 10 బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కాలేజీలు, 2 బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (బీప్లానింగ్) కాలేజీలు, 73 బీఫార్మసీ కాలేజీలు, 29 ఫార్మ్-డి కాలేజీలు ఉన్నాయి. ఈ ఫీజులు మూడేళ్ల పాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) అమల్లో ఉంటాయి.
 
ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు

 -    ఎన్నారై కోటా కింద చేరే విద్యార్థులు ట్యూషన్ ఫీజు కింద 5 వేల అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. (డాలర్ విలువ పెరిగినందున ఈ ఫీజు పెంపును ఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదించలేదు)
 -    ఎన్‌బీఏ అక్రెడిటేషన్ ఉన్న కోర్సుల్లో చేరే విద్యార్థులు ట్యూషన్ ఫీజుతోపాటు అదనంగా ఏటా రూ.3 వేలు చెల్లించాలి.
 -    మరో రూ.2 వేలను విద్యార్థి ప్రవేశాల సమయంలో అడ్మిషన్/రిజిస్ట్రేషన్/రికగ్నైజేషన్ ఫీజుగా చెల్లించాలి. ఇందులో రూ.500 యూనివర్సిటీకి సదరు విద్యా సంస్థ చెల్లిస్తుంది. మిగతా రూ.1,500 కాలేజీలో ఉంచాలి.
 -    విద్యార్థికి అందించే ప్రత్యేక సేవల కింద ఏటా మరో రూ.1,000 చెల్లించాలి. ఇందు లో కాలేజీ కార్యక్రమాలకు రూ.75, హెల్త్ సెంటర్ సేవలకు రూ.100, రీడింగ్ రూమ్‌కోసం రూ.25, కాలేజీ మ్యాగజైన్ కోసం రూ.50, హాబీ సెంటర్‌కు రూ.25, స్టూడెం ట్ హ్యాండ్‌బుక్ కోసం రూ.25, ల్యాబ్ ఫీజు రూ.150, లైబ్రరీ ఫీజు రూ.125, కంప్యూటర్, ఇంటర్నెట్ ఫీజు రూ.250, ప్లేస్‌మెంట్ సెల్‌కు రూ.125, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోసం రూ.50 కేటాయిస్తారు.
 -    ఏటా కామన్  సర్వీసెస్ కింద కాలేజీ యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుంచి మరో రూ.1,500 వసూలు చేసి యూనివర్సిటీకి చెల్లించాలి. ఇందులో పరీక్షల సంబంధ అంశాలకు రూ.500, అకడమిక్ ఆడిట్‌కు రూ.200, కరిక్యులమ్ రివిజన్, కంటెంట్ డెవలప్‌మెంట్‌కు రూ.300, స్టాఫ్ ట్రైనింగ్‌కు రూ.50, కో-ఆర్డినేషన్ మీటింగ్ కోసం రూ.50, యూనివర్సిటీ పబ్లికేషన్, వెబ్‌సైట్ మెయింటెనెన్స్‌కు రూ.200 చెల్లించాలి.
 -    లైబ్రరీ డిపాజిట్ కింద రూ.500, లేబొరేటరీ డిపాజిట్ కింద రూ.500 ప్రవేశాల సమయంలో వన్‌టైమ్ ఫీజుగా చెల్లించాలి.
 
కాలేజీలకు నిబంధనలు..

 -    ఏటా వార్షిక ట్యూషన్ ఫీజును ముందుగా వసూలు చేసుకోవచ్చు. లేదా ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో వసూలు చేసుకోవచ్చు. విద్యా సంస్థ ఏ విధానం ఎంచుకుంటే దానిని అమలు చేయాలి.
 -    విద్యా సంస్థలు క్యాపిటేషన్ ఫీజు లేదా ఇతర మరే పేర్లతో అదనపు ఫీజులు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ వసూలు చేయడానికి వీల్లేదు.
 -    యూనివర్సిటీ/ఏఐసీటీఈ అనుమతించని కోర్సులను, ఫీజు నిర్ధారించని కోర్సులను కొనసాగించడానికి వీల్లేదు.
 -    ప్రస్తుతం నిర్ణయించిన ఫీజులు ఆయా కళాశాలలు ఆన్‌లైన్ ద్వారా అందజేసిన వివరాల ఆధారంగా నిర్ధారించినవి. ప్రత్యక్ష తనిఖీల సందర్భంగా ఆ వివరాల్లో తప్పులున్నట్లు తేలితే ఫీజులను సవరించడంతోపాటు ఆయా కాలేజీలపై చర్యలు చేపడతారు.

మరిన్ని వార్తలు