సినీ నిర్మాత గోపాల్‌రెడ్డి కుమారుడి మృతి

9 May, 2018 02:27 IST|Sakshi

వాకాడు: భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ అధినేత, సినీ నిర్మాత దివంగత ఎస్‌ గోపాల్‌రెడ్డి, రాజేశ్వరమ్మ దంపతుల కుమారుడు ఎస్‌.భార్గవ్‌రెడ్డి (42) సోమవారం రాత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలి వద్ద ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి మృతి చెందారు. పంబలి గ్రామంలో ఉన్న తన భార్గవ్‌ హేచరీ వద్దకు సోమవారం వచ్చిన భార్గవ్‌రెడ్డి తన పెంపుడు కుక్కను తీసుకుని పక్కనే ఉన్న సముద్రం వద్దకు వెళ్లారు.

అక్కడ కుక్కకు స్నానం చేయించే సమయంలో వాతావరణంలో మార్పు కారణంగా అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో కుక్కతో సహా సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం మండలంలోని శ్రీనివాసపురం సముద్రం ఒడ్డుకు మృతదేహం కొట్టుకొచ్చింది. సమాచారం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, బంధువులు పంబలికి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు