‘సింగరేణి’కి ప్రథమ బహుమతి

17 Feb, 2018 02:39 IST|Sakshi

సింగరేణి కాలరీస్‌ దేశానికే ఆదర్శం: జగదీశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రెండ్రోజుల పాటు జరిగిన మైనింగ్‌ టుడే అంతర్జాతీయ సదస్సులో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన స్టాల్‌కు ప్రథమ బహుమతి దక్కింది. శుక్రవారం సదస్సు ముగింపు వేడుకల్లో భాగంగా పాల్గొన్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న చేతుల మీదుగా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ ఆంథోనిరాజ్‌ ఈ అవార్డును అందుకున్నారు. సింగరేణి స్టాల్‌లో కోల్‌ మైనింగ్‌ వర్కింగ్‌ మోడల్స్‌.. లాంగ్‌ వాల్‌ మైనింగ్, హై వాల్‌ మైనింగ్, డ్రాగ్‌ లైన్, ప్రొపెస్డ్‌ ఓబీ ప్లాంట్, మాన్‌రైడింగ్‌ సిస్టమ్స్‌ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కాలరీస్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషితో సింగరేణి అద్భుతంగా పనిచేస్తోందని చెప్పారు. మైనింగ్‌ పారదర్శకత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పర్యావరణ హితమైన పద్ధతిలో మైనింగ్‌ చేపడుతున్నట్లు మంత్రి జోగు రామన్న చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా మైనింగ్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. 

>
మరిన్ని వార్తలు