కువైట్‌లో చిక్కిన కార్మికులకు విమాన టికెట్లు

17 Feb, 2018 02:48 IST|Sakshi

కాంగ్రెస్‌ తరఫున 100 మందికి ఉచితంగా అందజేస్తాం: కుంతియా

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లి చిక్కుకుపోయిన భారతీయ కార్మికులు తిరిగి స్వదేశానికి వచ్చేలా తోడ్పాటు అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో కూడిన బృందం కువైట్‌లో పర్యటిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా శుక్రవారం కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లి కార్మికుల వివరాలు తెలుసుకున్నారు. సుమారు 30 వేల మంది భారతీయులు స్వదేశానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు.

అందులో ఐదు వేల మంది వరకు తెలంగాణ వలస కార్మికులున్నారు. కానీ స్వదేశానికి వెళ్లడానికి విమాన టికెట్లకు డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నారు. అలాంటి 100 మంది కార్మికులకు విమాన టికెట్లు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. తర్వాత వారిని మోసగించిందని ఆయన ఆరోపించారు. ఈ టికెట్ల ఖర్చును జేఎన్‌ వెంకట్‌ (కోరుట్ల), పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌), షబ్బీర్‌ అలీ (కామారెడ్డి), కెఆర్‌ సురేశ్‌రెడ్డి (ఆర్మూర్‌), సుదర్శన్‌రెడ్డి (బోధన్‌), మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌), ఈరవత్రి అనిల్‌ (బాల్కొండ), నంగి దేవేందర్‌రెడ్డి (మక్తల్‌) భరిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు