అవసరం తీరాక కులం తక్కువన్నాడు..

6 Jul, 2016 18:49 IST|Sakshi

నాగోలు: పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈసంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం... ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన ఓ యువతి (25) అద్దె ఇంట్లో ఉంటోంది.

 

వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం యాప్రాకపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జున్ కూడా యువతి ఉండే ఇంట్లోనే పైఅంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. యువతి పెళ్లి చేసుకోవాలని మల్లికార్జున్ సొంత గ్రామానికి వెళ్లి నిలదీయగా తక్కువ కులం అంటూ పెళ్లి చేసుకోనని బెదిరించాడు. తనను శారీరకంగా వాడుకుని కులం పేరుతో దూషించిన మల్లికార్జున్‌పై యువతి ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు