తండ్రి మందలించాడని ఇద్దరు బాలికలు...

5 Jan, 2016 22:40 IST|Sakshi

ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇద్దరు బాలికలు

బహదూర్‌పురా: తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన బాలికలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కూతుళ్ల కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రవిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన ఉస్మాన్ అలీ ఖాన్, మేరాజ్ బేగం దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో కలసి నివాసముంటున్నారు. పెద్ద కుమార్తె సమీహ 9వ తరగతి, చిన్న కుమార్తె నబీల్ 8వ తరగతి చదువుతున్నారు.

చెప్పిన పని చేయలేదని ఈ నెల 4వ తేదీన కూతుళ్లను ఉస్మాన్ అలీఖాన్ మందలించాడు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన వీరు రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మేరాజ్ బేగం తన కూతుళ్లు కనిపించడం లేదని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040-27854789, 9490616309 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు, తల్లిదండ్రులు కోరారు.

మరిన్ని వార్తలు