హైదరాబాద్: ఫేస్బుక్ భారత వ్యవహారాల చీఫ్ కార్తీక రెడ్డిపై నమోదైన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. జస్టిస్ పి.వి. సంజయ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
సోషల్ మీడియాకు సంబంధించి కొన్ని సాంకేతిక అంశాలపై కాపీరైట్ విషయంలో కార్తీకరెడ్డి తనపై భౌతికదాడులు చేయించారని ప్రదీప్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జూబ్లీహిల్స్, మాదాపూర్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా పోలీసులు దర్యాప్తును పక్కన పెట్టారని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ కల్లా వివరాలు తెలపాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను జూన్ 2కు వాయిదా వేశారు.