సమన్యాయముంటే సమస్యేలేదు

10 Dec, 2013 04:24 IST|Sakshi

 =‘ఐదేళ్ల నిబంధన’ ఇది లేని కారణంగానే
 =ఏళ్లుగా అనేక మంది విధులు లూప్‌లైన్లలోనే
 =అండ ఉన్న వారికే ఫోకల్ పోస్టింగ్ అవకాశం
 =పరిస్థితి సమీక్షించాలని కోరుతున్న సిబ్బంది

 
సాక్షి, సిటీబ్యూరో: ‘పలుకుబడి ఉన్న వాడికే పోస్టింగ్... ‘ఖద్దరు’ అనుగ్రహిస్తేనే బాధ్యతలు తీసుకోగలిగేది’... ఇదీ ప్రస్తుతం పోలీసు విభాగంలో జనమెరిగిన సత్యం. ఫలితంగా పోస్టింగ్స్‌లో సమన్యాయం లేక అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గత డీజీపీ హయాంలో తెరపైకి వచ్చిన ‘ఐదేళ్ల నిబంధన’ కూడా ఇలాంటి పరిస్థితుల వల్లే ఏర్పడిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దకుంటే  సిబ్బందిలో నైతికస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
 
రేటు కట్టి మరీ వసూలు...

జంట కమిషనరేట్ల పరిధిలో బదిలీలు చేపట్టిన ప్రతిసారీ ఉన్నతాధికారులకు తలనొప్పులే. ప్రతి సందర్భం లోనూ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పోస్టింగ్ ఇవ్వడమనేది అసాధ్యంగా మారిపోయింది. ‘ఖద్దరు’ జోక్యంతో జంట కమిషరేట్ల పరిధిలో పోలీసుస్టేషన్లలో ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ‘రేటు’ కట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. ఈ ధోరణి కారణంగా అనునిత్యం పైరవీలు చేసుకునే సామర్థ్యం ఉన్న వారు ఫోకల్ పోస్టిం గ్స్‌గా పిలిచే కీలక ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓలుగా ఏళ్ల పాటు పని చేయగలుగుతున్నారు. ఈ ఖద్దరును కాదని ఎవరైనా ఉన్నతాధికారి పోస్టింగ్ ఇచ్చినా... సదరు అధికారి అక్కడ చేరడం అసాధ్యమనే చెప్పాలి. గతంలో కొన్ని పోస్టింగ్స్ మారిపోవడమే దీనికి తార్కాణం.
 
సమర్థత, సీనియారిటీ జాన్తానై...

బదిలీ విషయంలో ఈ విధానం ఏ స్థాయికి పెరిగిం దంటే... ఖద్దరుకు ఖరీదు చెల్లించలేకపోయినా... పై స్థాయి వరకు పైరవీ చేసే పలుకుబడి లేకపోయినా ఆ అధికారులు ఏళ్ల తరబడి లూప్ లైన్స్‌గా పిలిచే ప్రాధాన్యం లేని పోస్టులో కొనసాగాల్సి వస్తోంది. సదరు అధికారి ఎంతటి సమర్థుడైనా, గతంలో ఎలాంటి కీలక విభాగాలు, సున్నితమైన కేసుల్ని పర్యవేక్షించినా ఈ పైరవీల జోరులో పక్కకు వెళ్లిపోతాయి. కేవలం సిఫా ర్సు లేఖల ఆధారంగా జరుగుతున్న ఈ వ్యవహారంలోనూ పోటీ పెరిగిపోవడంతో కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. దీనికి విరుగుడుగానే గతంలో ఐదేళ్ల పాటు కమిషనరేట్‌లో పని చేస్తే బయటకు వెళ్లాలనే నిబంధన విధించారు. ప్రతిభకు పూర్తిగా పాతర పడటం, రాజ కీయ నాయకులు, ఉన్నతాధికారుల పైరవీల జాతర జరుగుతుండటంతోనే ఈ విధానం అమలులోకి తేవాల్సి వచ్చిందన్నది సిబ్బంది మాట.
 
సిటీలోనూ లూప్‌లైన్లు...
 
ఐదేళ్ల పాటు కమిషనరేట్‌లో పని చేసిన అధికారుల్ని ఎంపిక చేసే విధానంలోనూ లోపాలున్నాయన్నది అధికారుల మాట. కమిషనరేట్‌లో ఉన్న లూప్‌లైన్లలో పని చేసిన వారిని, ఫోకల్ పోస్టుల్లో విధులు నిర్వర్తించిన వారినీ ఒకే గాటిన కట్టి బయటకు పంపడం తీవ్ర అన్యాయమని వాపోతున్నారు. ఇక్కడి లూప్‌లైన్లలో పని చేస్తున్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. మరోపక్క సుప్రీం కోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానాలు సైతం ఎస్‌హెచ్‌ఓ ఆ పైస్థాయి అధికారులు వివాదాస్పదమైతే మినహా రెండేళ్ల పాటు పోస్టులో కొనసాగాలని చెప్తుండగా... కొన్ని పరిస్థితుల్లో తీసుకున్న ‘ఏడాది పాటే’ అనే నిబంధన అన్యాయమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక విభాగాల్లో చేరిన వ్యక్తి దానిపై పట్టు సాధించడానికే ఆరు నెలలకు పైగా పడుతుందని, అలాంటిది ఏడాదికే బదిలీ అంటే అన్యాయమంటున్నారు.
 
 ఇలా చేస్తే ఉత్తమం...


 ఈ పోటీ ఎక్కువగా ఇన్‌స్పెక్టర్ స్థాయిలోనే ఉం టోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించి, కొన్ని కీలక చర్యల్ని తీసుకుంటే పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన వ్యక్తి కనిష్టంగా ఎనిమిదేళ్లు ఆ హోదాలో పని చేస్తారు. ఈ కాలంలో ఒక్కో పోస్టింగ్ రెండేళ్లంటూ లెక్కకట్టినా... రెండు ఫోకల్, రెండు లూప్‌లైన్లు చేసేలా నిబంధన విధిం చాలి. దీనివల్ల అందరికీ అవకాశం రావడంతో పాటు పైరవీల జోరు తగ్గుతుంది.
 

మరిన్ని వార్తలు