సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతుడైన రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థికి కేటాయించిన సీటు ఖాళీ అయితే, ఆ సీటును రిజర్వ్డ్ కేటగిరీకే చెందిన మరో అభ్యర్థితోనే భర్తీ చేయాలంటూ 2001లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 550 పేరా 5(2) అమలును ఉమ్మడి హైకోర్టు నిలుపుదల చేసింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రమేశ్రామ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని జీవో 550 అమలును నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
జీవోపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్, రిజిస్ట్రార్, 2017 నీట్ కన్వీనర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేస్తూ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ తేలప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆకుల వెంకట హర్షవర్దన్, మరో ఇద్దరు విద్యార్థులు ఈ పిటిషన్ వేశారు.