అదనపు సీట్లు, కొత్త కాలేజీలు వద్దు

10 Aug, 2016 02:11 IST|Sakshi

ఎన్‌సీటీఈకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఐదు లక్షల మందికిపైగా ఉన్నందున ఇకపై ఉపాధ్యాయ విద్యా కాలేజీలు, అదనపు సీట్లకు అనుమతులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ)ని కోరింది. తాము అడిగే వరకు కొత్త కాలేజీల ప్రారంభాలకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎన్‌సీటీఈకి సర్కారు లేఖ రాసింది. రాష్ట్రంలో 11 కొత్త డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలు, 17 బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కాలేజీలు, 20 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల ప్రారంభానికి తాత్కాలిక గుర్తింపు ఇవ్వడాన్ని లేఖలో ప్రస్తావించింది.

రాష్ట్రంలో ఉన్న 330 ఉపాధ్యాయ విద్యా కాలేజీల (బీఎడ్-196, డీఎడ్-212, బీపీఈడీ-22) నుంచి ఏటా 30 వేల మంది అభ్యర్థులు బయటకు వస్తున్నారని, ఇవి కాకుండా పండిత శిక్షణ కాలేజీలు, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయని వివరించింది. వీటి నుంచే రా నున్న 15 ఏళ్లలో మరో 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసుకొని బయటకు రానున్నారని...2030 నాటికి ఉపాధ్యాయ విద్య పూర్తి చేసుకున్న అ భ్యర్థుల సంఖ్య 10 లక్షలు దాటనుందని, వా రందరికీ సరిపడ ఉపాధ్యాయ పోస్టులు ప్రభు త్వ, ప్రైవేటు రంగాల్లో లేవని వివరించింది. కేవలం 44,842 పోస్టులు మాత్రమే వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని కోరింది.
 

మరిన్ని వార్తలు